హైదరాబాద్: డేవిస్ కప్ ఆడే భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా వెటరన్ స్టార్ మహేశ్ భూపతిని నియమిస్తూ ఏఐటీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ స్ధానంలో ఉన్న టెన్నిస్ ఆటగాడు ఆనంద్ అమృత్రాజ్పై వేటు పడింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు పుణె వేదికగా న్యూజిలాండ్తో భారత జట్టు డేవిస్కప్లో తలపడనుంది. డేవిస్ కప్కు సంబంధించి సాకేత్ మైనేని, రామ్ కుమార్ రామనాథన్, యుకీ బాంబ్రీ, లియాండర్ పేస్, ప్రజ్నేష్ గున్నేశ్వరన్లతో కూడిన జట్టుని అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఏఐటీఏ) ప్రకటించింది.
ఈ నేపథ్యంలో అమృత్రాజ్ స్థానంలో మహేశ్ భూపతిని నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమృత్రాజ్ హయాంలో జట్టులోని ఆటగాళ్లలో క్రమశిక్షణ లోపించిందని అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఏఐటీఏ) భావించడంతో ఈ నిర్ణం తీసుకున్నారు.
మరో ఏడాదిపాటు తనను కొనసాగించాలని అమృత్రాజ్ పట్టుబడినప్పటికీ ఏఐటీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ అతడిని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కోచ్ జీషాన్ అలీ పదవీకాలం కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో జీషాన్ స్థానంలో కోచ్ పదవికోసం సింగిల్స్ ఆటగాడు సోమ్దేవ్ దేవ్వర్మన్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.