న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక గ్రహీత, ప్రముఖ భారతీయ బాక్సర్ మేరీ కోమ్ రియో ఒలింపిక్స్ తర్వాత బాక్సింగ్ పోటీల నుంచి నిష్క్రమించనున్నట్టు చెప్పారు. 2016 ఒలింపిక్స్ తర్వాత తాను విశ్రాంతి తీసుకుంటానని 32 ఏళ్ల మేరీ కోమ్ సోమవారం ప్రకటించారు.
సోషల్ మీడియా క్యాంపెయిన్ ప్రచారంలో భాగంగా మేరీ కోమ్ మాట్లాడుతూ 2016 ఒలంపిక్స్ తర్వాత తాను బాక్సింగ్ పోటల నుంచి తప్పుకోనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న రియో ఒలంపిక్సే తనకు చివరి పోటీ కార్యక్రమం అవుతుందని అన్నారు.
రియో ఒలంపిక్స్ తర్వాత బాక్సింగ్ లాంటి క్రీడకు తన వయసు సహకరించదని ఆమె పేర్కొన్నారు. తన మూడవ బిడ్డకు రెండు సంవత్సరాలు వచ్చాయని, ఇంక చాలని అన్నారు. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా బాక్సింగ్ వాతావరణాన్ని ఎదుర్కొనేది ఎవరని ప్రశ్నించారు.
రియో ఒలంపిక్స్లో బంగారు పతకం సాధించి దేశ ప్రజలకు ఆనందాన్ని తీసుకురావాలని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టంతా రియో ఒలంపిక్స్పై ఉందన్నారు. రియో ఒలంపిక్స్ అనంతరం మణిపూర్లో తాను నిర్మిస్తున్న బాక్సింగ్ అకాడమీపై దృష్టి పెడతానని చెప్పారు.
మణిపూర్లో తాను నిర్మిస్తున్న బాక్సింగ్ అకాడమీ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని, మేరీ కోమ్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీని స్వయంగా అకాడమీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికే కలిశానని, ఆయన కచ్చితంగా వస్తానన్నారని తన ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఏప్రిల్ నెలాఖరు కల్లా మేరీ కోమ్ అకాడమీ నిర్మాణం పూర్తవనుంది.