ఐజ్వాల్: మిజోరాం ఫుట్బాలర్ పీటర్ బియాక్సంజులా అత్యుత్సాహం అతని ప్రాణాలను హరించింది. మిజోరాం ప్రీమియర్ లీగ్ (ఎంపిఎల్)లో భాగంగా మంగళవారం చెన్మరీ వెస్ట్ ఫుట్బాల్ క్లబ్తో బెథ్లెహామ్ వెంథ్లాంగ్ జట్టు తలపడింది. చెన్మరీ ఒక గోల్ ఆధిక్యాన్ని సంపాదించగా, బెథ్లెహామ్కు పీటర్ అతి కష్టం మీద ఈక్వెలైజర్ను అందించాడు.
గోల్ చేసిన వెంటనే వెనక్కు పల్టీలు కొట్టాడు. పట్టుతప్పడంతో అతని తల భూమికి బలంగా తగిలింది. మెడ ఎముకలు విరిగడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
పీటర్ కిందపడినప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోకుండా జట్టులోని చాలా మంది సహచరులు అతనిపై పడ్డారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. తర్వాత అసలు విషయాన్ని గుర్తించిన వెంటనే సహాయక సిబ్బంది పీటర్ను ఆసుపత్రికి తరలించారు. ఐసియుకు తరలించిన వైద్యులు అతనికి వెంటిలేటర్లు అమర్చి, స్పైనల్ కార్డ్కు శస్త్ర చికిత్స చేసేందుకు ప్రయత్నించారు.
కాగా, ఐసీయూలో ఐదు రోజులు చికిత్స పొందిన పీటర్ ఆదివారం మృతిచెందాడు. చికిత్స పొందుతున్న సమయంలోనే పీటర్ తన కళ్లను దానం చేసేందుకు అంగీకరించినట్టు సమాచారం.
మంగళవారం జరిగిన ఆ మ్యాచ్లో పీటర్ ప్రాతినిథ్యం వహించిన బెథ్లెహామ్ జట్టు 2-3 తేడాతో ఓడిపోయింది. కాగా, స్పైనల్ కార్డ్ దెబ్బతిన్న కారణంగానే అతను మృతి చెందాడని వైద్య పరీక్షల్లో స్పష్టమైంది. ఈ సంఘటన మిజోరాంలోనేగాక, దేశ సాకర్ రంగంలోనూ విషాదచ్ఛాయలను నింపింది.