ముంబై: ఐపీఎల్ 8లో హిట్టర్లు విజృంభించి ఆడటంతో బౌండరీ మీటర్ జెట్ స్పీడుతో దూసుకెళ్లింది. ఈ సీజన్లో అన్ని జట్లవి కలిపి మొత్తం 18,332 పరుగులు నమోదయ్యాయి. అందులో కేవలం బౌండరీల ద్వారానే 10,580 పరుగులు రావడం గమనార్హం.
అన్ని జట్లు బౌండరీలు బాదారు. ఇందులో 1607 ఫోర్లు, 692 సిక్స్లు ఉన్నాయి. ఎక్కువ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ నిలిచాడు. అతను 38 సిక్స్లు కొట్టాడు. ఎక్కువ ఫోర్లు కొట్టిన జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సారథి డేవిడ్ వార్నర్ (65 ఫోర్లు) నిలిచాడు.
కాగా, ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ 8వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ని ఓడించి రెండోసారి టైటిల్ ఛాంపియన్గా అవతరించింది. టోర్నమెంట్లో భాగంగా చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత అవార్డులను ఐపీఎల్ గవర్నింగ్ బాడీ సభ్యులు ఆటగాళ్లకు అందజేశారు.
టాస్ ఓడి బ్యాంటింగ్ని ప్రారంభించిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.
ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దక్కించుకున్నాడు. ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడికిచ్చే పర్పల్ క్యాప్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు డ్వేన్ బ్రావో దక్కించుకున్నాడు.