హైదరాబాద్: మే 22 (సోమవారం) ప్రపంచ క్రీడాభిమానులకు ఓ చేదు వార్తను అందించింది. ఓ ప్రమాదంలో గాయపడిన మాజీ మోటోజీపీ ఛాంపియన్ నిస్కీ హైడెన్ (35) సోమవారం కన్నుమూశారు.
రివేరా డి రిమిని ప్రాంతంలో సైకిల్పై వెళ్తోన్న నిస్కీ హైడెన్ను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో స్థానిక ఆసుపత్రి నుంచి సెసేనాలోని బుఫాలిని ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుఫాలిని ఆసుపత్రిలో సోమవారం కన్నుమూశాడు. నిస్కీ హైడెన్ సీరియస్ పోలైట్రామా కారణంగా మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. నిస్కీ హైడెన్ని అభిమానులు ముద్దుగా కెంటుకీ కిడ్ అని కూడా పిలుస్తారు.
ఈ ఏడాది మే 14న ఇటలీలో జరిగిన వరల్డ్ సూపర్ బైక్ ఛాంపియన్ షిప్లో రెడ్ బుల్ హోండా తరుపున ప్రాతినిథ్యం వహించాడు. నిస్కీ హైడెన్ మరో సోదరుడు టామ్మీ కూడా బైక్ రేసరే కావడం విశేషం. హైడెన్ మరణవార్త వినగానే అతడి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు.
ఈ సందర్భంగా టామ్మీ మాట్లాడుతూ తన సోదరుడితో తనకు ఎన్నో మధుర క్షణాలు ఉన్నట్లు తెలిపాడు. అతడు సాధించిన విజయాల పట్ల మాకెంతో గర్వంగా ఉందని, అతడిని మిస్సవుతున్నామని ఎంతో బాధతో వెల్లడించాడు.