ఇండోర్: ట్వంటీ 20 సిరీస్ ఓటమి తర్వాత భారత జట్టుకు, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి తొలి వన్డేలోను దక్షిణాఫ్రికా షాకిచ్చింది. దీంతో, మహేంద్ర సింగ్ ధోనీ పైన విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, రెండో వన్డేలో ధోనీ, భారత జట్టు సత్తా చాటవలసి ఉంది. అప్పుడే ఊరట లభిస్తుంది.
దక్షిణాఫ్రికా - భారత్ రెండో వన్డే బుధవారం నాడు ఇండోర్లోని హోల్కార్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం భారత జట్టు సిద్ధమవుతోంది. తొలి వన్డేలో 304 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో భారత్ విఫలమైంది. మొదట బౌలింగులో, ఆ తర్వాత చివరలో బ్యాటింగులో విఫలమైంది.
ఈ నేపథ్యంలో ధోనీ, భారత జట్టు కొన్ని మార్పులు చేయవలసి ఉందని క్రికెట్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఊరట కలిగించే విషయమేమంటే.. ఇండోర్ స్టేడియంలో భారత్కు వంద శాతం విజయం ఉంది. గతంలో ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లో భారత్ గెలిచింది.
బుధవారం నాడు మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ధోనీ సేన విజయం కోసం తపిస్తోంది. ఏం చేయాలంటే...
1. మూడో నెంబర్లోనే విరాట్ కోహ్లీ
తొలి వన్డే సమయంలో కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ... అజింక్యా రహానేను జట్టులో ఆడించే విషయంలో ఏ నెంబర్లో దించాలనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడ్డాడు. అయితే, నెంబర్ 3లో రహానేను దించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. నెంబర్ 4 స్థానంలో వచ్చిన కోహ్లీ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లీని నెంబర్ 3లో ఆడించాలంటున్నారు.
2. శిఖర్ ధావన్ బదులు రహానే
లెఫ్ట్ హ్యాండర్ శిఖర్ ధావన్ గత మూడు మ్యాచుల్లో ఆకట్టుకోలేదు. రెండు ట్వంటీ 20ల్లో, తొలి వన్డేలో అతను రాణించలేదు. ఈ నేపథ్యంలో ఓపెనర్గా రోహిత్ శర్మతో పాటు రహానేను ప్రయత్నించవచ్చంటున్నారు. ఓపెనింగ్ రోల్ రహానేకు కొత్తేమీ కాదు. రోహిత్ శర్మతో మంచి అండర్ స్టాండింగ్ ఉంటుంది. తొలి వన్డేలో వీరు తమ పార్ట్నర్షిప్లో సెంచరీ దాటారు.
3. చివరి ఓవర్లు మెరుగు పడాలి
తొలి వన్డేలో 44 ఓవర్ల వరకు ఆడిన సౌతాఫ్రికా ఆటకు.. ఆ తర్వాత ఆరు ఓవర్ల ఆటకు చాలా తేడా ఉంది. కేవలం చివరి ఆరు ఓవర్లలోనే 86 పరుగులు ఇచ్చారు మన బౌలర్లు. ఈ నేపథ్యంలో ఎండ్ (చివరి) ఓవర్లలో బౌలర్లు జాగ్రత్త వహించాలంటున్నారు. మరోవైపు, అశ్విన్ లోని లోటును మిగతా బౌలర్లు దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
4. బిన్నీ
బిన్నీ తొలి వన్డేలో 8 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయకుండా 63 పరుగులు ఇచ్చాడు. మరోవైపు ఫైనల్ ఓవర్లలో బ్యాటింగ్ సమయంలో ఒత్తిడికి లోనయ్యాడు. ఇతను 5 బంతులు ఆడి రెండు పరుగులే చేశాడు. ఇతని స్థానంలో అంబటి రాయుడుని లేదా మోహిత్ శర్మను తీసుకోవచ్చునని, తద్వారా బౌలింగును కూడా మెరుగుపర్చుకోవచ్చంటున్నారు.
5. ఆల్ రౌండర్ గుర్ కీరత్ సింగ్ మన్ను ధోనీ ఉపయోగించుకోవాలంటున్నారు. ఇండియా ఏ లో బ్యాట్తో పాటు బంతితోను తన ఆఫ్ స్పిన్తో ప్రతిభ కనబర్చాడు. ఈ నేపథ్యంలో ధోనీ 25 ఏళ్ల గుర్ కీరత్ సింగ్ను ప్రయత్నించాలంటున్నారు.