న్యూఢిల్లీ: టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో ఉన్న 11 ఏళ్ల అనుబంధానికి బహుళజాతి కంపెనీ పెప్సికో స్వస్తి పలికింది. పెప్సికో కంపెనీ తన కొత్త ఐకాన్గా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని నియమించింది. దీనికి సంబంధించి పెప్సికో నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
35 ఏళ్ల ధోని టీమిండియాకు బీసీసీఐ అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరు. 2005లో ధోనితో పెప్సికో కంపెనీ తన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 'ఛేంజ్ ద గేమ్' అంటూ పెప్సికో ప్రకటనల్లో ధోని మెరిశారు. టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం ధోని ప్రభావం తగ్గిన సంగతి తెలిసిందే.
అదే క్రమంలో టెస్ట్ క్రికెట్ పగ్గాలు చేపట్టిన కోహ్లీ తనదైన శైలిలో దూసుకుపోవడం, యూత్ ఐకాన్గా మారడంతో పెప్సికో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై పెప్సిక్ బేవరేజెస్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ ప్రకాశ్ మాట్లాడుతూ పెప్పికో ఉత్పత్తులను వినూత్నంగా మార్కెటింగ్ చేయాలని నిర్ణించామని అన్నారు.
అందులో భాగంగానే తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు సెలబ్రిటీని ఎంచుకున్నట్లు ఆయన వివరించారు. డ్రింక్స్ విభాగంలో 7Up, మౌంటన్ డ్యూ, స్నాక్స్ విభాగంలో లేస్, కుర్కురే లాంటి వాటిని పెప్సికో కంపెనీ ఉత్పత్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. పెప్సికో ఉత్పత్తులకు ఇప్పటికే బాలీవుడ్కు చెందిన రణబీర్ కపూర్, పరిణితి చోప్రా లాంటి సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు.