న్యూఢిల్లీ: అక్రమలావాదేవీల కేసులో విచారణకు హాజరుకాకుండా విదేశాలలో కాలం వెల్లదీస్తున్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీకి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. మనీ లాండరింగ్ కేసులో తప్పించుకున్న లలిత్ మోడీకి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ కావడంతో కేసు కొత్త మలుపుతిరిగింది.
మనీ లాండరింగ్ కేసులో లలిత్ మోడీ విచారణకు హాజరు కావడం లేదని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబై కోర్టును ఆశ్రయించింది. లలిత్ మోడీకి నాన్ బెయిల్ బుల్ వారెంట్లు జారీ చెయ్యాలని మనవి చేశారు. కేసు వివరాలు తెలుసుకున్న ముంబై పత్రేక న్యాయస్థానం బుధవారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
ఐపీఎల్ చీఫ్ గా ఉన్న సమయంలో లలిత్ మోడీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తరువాత లలిత్ మోడీ ఐపీఎల్ చీఫ్ పదవి నుండి ఉద్వాసనకు గురి అయ్యాడు.
అదే సమయంలో కేసులు నమోదు కావడంతో లలిత్ మోడీ 2010లో లండన్ పారిపోయాడు. విచారణకు హాజరుకాకుండా అధికారులకు చుక్కలు చూపించాడు. అంతే కాకుండ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మీద అనేక ట్విట్ లు చేసి ఆడుకున్నాడు. లలిత్ మోడీ వ్యవహారంతో పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్న సమయంలో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.