కొచ్చి: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అనంతరం జీవితకాల నిషేధానికి గురైన పేస్ బౌలర్ శ్రీశాంత్పై హత్యాయత్నం జరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీశాంత్ బావమరిది వెల్లడించారు. తీహార్ జైలులో ఉన్న సమయంలో శ్రీశాంత్పై హత్యాయత్నం జరిగిందని తెలిపారు.
కేరళలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. శ్రీశాంత్ జైలులో ఉన్న సమయంలో ఓ దుండగుడు అతనిపై దాడి చేశాడు. పదునైన ఆయుధంతో శ్రీశాంత్పై దాడి చేయగా, అతడు తృటిలో తప్పించుకున్నాడు. 2013లో ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అనంతరం శ్రీశాంత్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
'పదునైన తలుపు బోల్టుతో ఓ దుండగుడు జైలులో శ్రీశాంత్పై హత్యాయత్నం చేశాడు. అయితే అతని దాడి నుంచి శ్రీశాంత్ ఎలాంటి గాయం కాకుండా తప్పించుకున్నాడు' అని శ్రీశాంత్ బావ మరిది, ప్లేబ్యాక్ సింగర్ మధు బాలకృష్ణ శుక్రవారం 'మనోరమ న్యూస్' తెలిపారు.
దాడి ఘటన ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో శ్రీశాంత్ను ప్రత్యేక జైలులో ఉంచారని బాలకృష్ణ చెప్పారు. 'అయితే దాడి ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారో లేదో మాకు తెలియదు. ఐపిఎల్ స్కామ్కు సంబందించే ఈ దాడి జరిగిందని ఖచ్చితంగా చెప్పలేం' అని బాలకృష్ణ చెప్పారు.
2013లో జరిగిన ఐపిఎల్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బిసిసిఐ శ్రీశాంత్పై జీవితకాలం నిషేధం విధించింది. కాగా, 2007లో జరిగిన ట్వంటీ20 ప్రపంచ కప్, 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో శ్రీశాంత్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. 2013, మేలో ఐపిఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడిన సమయంలో శ్రీశాంత్ను ముంబైలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.