మిర్పూర్: బంగ్లాదేశ్ యువ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్పై మరో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. షేర్ ఈ బంగ్లా స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో పది ఓవర్లు వేసిన ముస్తాఫిజుర్.. 2/57(రోహిత్, రైనాలను ఔట్ చేశాడు)తో మూడు మ్యాచుల వన్డే సిరీస్లో భారత్పై అత్యధికంగా 13 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.
ద్వైపాక్షిక టోర్నీలో ఒక బౌలర్ 13 వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2010లో పాకిస్థాన్ జట్టుతో జరిగిన మూడు మ్యాచుల్లో ఆస్ట్రేలియా బౌలర్ రియాన్ హ్యారీస్ కూడా 13 వికెట్లు తీశాడు. అయితే అది ఐదు మ్యాచుల సిరీస్.
ఈ సిరీస్లో ముస్తాఫిజుర్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. తొలి అంతర్జాతీయ వన్డేలోనే ఐదు వికెట్లు తీసిన ముస్తాఫిజుర్ సంచలనం సృష్టించాడు. రెండో వన్డేలో మరో 6 వికెట్లు తీశాడు.
గత రెండు మ్యాచులో ఐదు కంటే ఎక్కువ వికెట్లు తీసిన ముస్తాఫిజుర్.. చివరి మూడో వన్డేలో మరో రెండు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మొదటి రెండు మ్యాచుల్లోనే 11 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.