న్యూఢిల్లీ: శ్రీలంకలో 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు సిరీస్ను నెగ్గడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ప్రధాని మోడీ భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
దాదాపు 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా లంక గడ్డపై టెస్టు సిరీస్ ను నెగ్గింది. మంగళవారం మధ్యాహ్నం ముగిసిన మ్యాచ్లో కోహ్లీ సేన 117 పరుగుల తేడాతో శ్రీలంక జట్టును చిత్తు చేసింది. మూడు టెస్టుల సిరీస్లో తొలి టెస్టును చేజేతులా జారవిడుచుకున్న కోహ్లీ సేన.. ఆ తర్వాత రెండు టెస్టులలో విజయం సాధించింది.
భారత క్రికెట్ జట్టు విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా కోహ్లీ సేనకు శుభాకాంక్షలు చెప్పారు. సమిష్టిగా రాణించి చిరస్మరణీయ విజయాన్ని అందించారని జట్టు పైన ప్రశంసలు కురిపించారు.
కోహ్లీ ప్రపంచ నెంబర్ 1
శ్రీలంకతో టెస్ట్ సిరీస్ విజయం అనంతరం విరాట్ కోహ్లీకి మరో తీపి కబురు వచ్చింది. ట్వంటీ 20 బ్యాట్సుమెన్లలో కోహ్లీ నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం టీ 20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇంతకుముందు ఆరోన్ ఫించ్ మొదటి స్థానంలో ఉన్నాడు.