ఢిల్లీ: తన పైన కోచ్ అత్యాచారం చేశాడని ఓ జాతీయ స్థాయి షూటర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్లో ఆమె పేర్కొన్న ప్రకారం.. తామిద్దరం రిలేషన్ షిప్లో ఉన్నామని, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, దాంతో తామిద్దరం సహజీవనం చేశామని ఆమె పేర్కొన్నదని తెలుస్తోంది.
సమాచారం మేరకు.. నేషనల్ ఛాంపియన్ షిప్లో పాల్గొనేందుకు షూటింగ్ రేంజ్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ తీసుకుంటున్న బాధిత మహిళకు అక్కడే శిక్షణ పొందుతున్న సీనియర్ షూటర్తో రెండేళ్ల క్రితం పరిచయమేర్పడింది.
నిందితుడు ఆమెకు షూటింగ్లో గైడ్గా కూడా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో వివాహం చేసుకుంటానని మాటిచ్చాడు. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా చాణిక్యపురిలోని నివాసానికి వెళ్లాడు. కూల్ డ్రింకులో మత్తు కలిపి ఇచ్చి, అపస్మారక స్థితికి చేరుకున్నాక అత్యాచారం చేశాడు.
అనంతరం తప్పించుకుని తిరుగుతున్న నిందితుడికి బాధితురాలు ఫోన్ చేసింది. కాని అతని నుంచి ఎలాంటి స్పందన లేదు. తర్వాత షూటింగ్ రేంజ్లో అతడిని కలిసి నిలదీసింది.
నిన్ను కాల్చి చంపేసి, ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతానని అతను తనను బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న చాణిక్యపురి పోలీసులు బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని, విచారణకు హాజరు కావాలని నిందితుడిని ఆదేశించామని పోలీసులు చెప్పారు.