న్యూఢిల్లీ: 21 ఏళ్ల జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు హన్స్రాజ్ హత్య కావించబడ్డాడు. అతడి మృతదేహం హర్యానాలోని కాక్రోయి గ్రామ శివారులో ఒక గోనెసంచిలో లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహంపై తీవ్రంగా కొట్టిన గాయాలున్నాయని తెలిపారు.
హన్స్రాజ్ సోమవారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు అతడి మృతదేహం గురువారం గ్రామ శివారులో లభ్యమైంది.
మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించామని, నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాక్రోయి గ్రామంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఐదు జరిగాయని, దోషులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు.