బెంగుళూరు: మూడు ఒలింపిక్స్లో తాను ఆడతానని ఎన్నడూ ఊహించలేదని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో రియోలో జరగనున్న ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన ఆమెకు హుందై మోటార్ ఇండియా లిమిడెట్ నిర్వహించిన సన్మాభ కార్యక్రమంలో గురువారం మీడియాతో మాట్లాడారు.
బ్రెజిల్లోని రియో డిజనిరియోలో జరగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించటం పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2012లో లండన్లో జరిగిన ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. లండన్ ఒలింపిక్స్తో పోలిస్తే రియో ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శనను ఇస్తానని అన్నారు.
రియో ఒలింపిక్స్ అంతా ఈజీ కాదని చెప్పిన సైనా, తన శక్తిమేరకు ఆడతానని తెలిపారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను గెలిచిన సందర్భంగా హుందై క్రెటా ఎస్యువీని తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో సైనాకు బహూకరించింది. ఈ సందర్భంగా సైనా తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.
తాను సాధించిన విజయాలకు ఏ అథ్లెట్కైనా సరైన గుర్తింపు లభిస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు. రాబోయే టోర్నమెంట్లో జాతి గర్వించేలా విజయాలను సాధించేందుకు తన శక్తిమేరకు కష్టపడతానని అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్లో సైనా నెహ్వాల్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
తొలిసారిగా సైనా నెహ్వాల్ 2008లో చైనాలో జరిగిన ఒలింపిక్స్లో పాల్గొన్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లిన సైనా మారియా క్రిస్టన్ యూలాంటి చేతిలో ఓటమి పాలై ఒలింపిక్స్ నుంచి నిష్త్రమించారు. కాగా హుందై మోటార్ ఇండియా లిమిటెడ్ సీఈఓ వైకే కూ మాట్లాడుతూ భారత్ బ్యాడ్మింటన్ ఐకాన్గా సైనా గుర్తింపు పొందారని అన్నారు.