హైదరాబాద్: ఇప్పట్లో రిటైరయ్యే అలోచన లేదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. ప్రపంచ కప్ పోటీల్లో తమకు మద్దతు తెలిపినవారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. సెమీ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియాపై 95 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత గురువారంనాడు ఆయన మాట్లాడాడు. టాపార్డర్ విఫలమైనప్పుడు అద్భుతాలు చేయలేమని ధోనీ అన్నాడు.
ఈ ఓటమి ఆటగాళ్లందరికీ ఓ గుణపాఠమని అన్నాడు. ట్వంటీ 25 ప్రపంచ కప్ పోటీల తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని చెప్పాడు. ఆస్ట్రేలియాపై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో ఇటు బౌలింగులోనూ అటు బ్యాటింగ్లోనూ పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు.
వన్డే స్పెషలిస్టు సురేష్ రైనా కూడా ఏ మాత్రం ప్రతిభ కనబరచలేకపోయాడు. కోహ్లీ, రైనాల ఆటతీరుపై అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ కాస్తా మెరుగ్గానే ఆడాడు. అతను 65 పరుగులు చేశాడు. అతను ఔట్ కావడంతో మ్యాచ్పై పూర్తిగా ఆశలు సన్నగిల్లాయి.
ప్రపంచ కప్ పోటీల్లో వరుసగా 11 విజయాలు సాధించిన టీమిండియాకు ఆస్ట్రేలియా చెక్ పెట్టింది. కాగా, మెల్బోర్న్లో జరిగే ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ను ఎదుర్కోనుంది. భారత్ బ్యాట్స్మన్లో ఆరుగురు రెండంకెల స్కోరు చేయలేకపోయారు. సైమీ ఫైనల్లో ఓడిపోయిన నేపథ్యంలో రాంచీలో ధోనీ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.