హైదరాబాద్: అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సమాఖ్య (వాడా) తాజాగా వెలువరించిన స్వతంత్ర నివేదిక ప్రకారం రష్యాలో డోపీల సంఖ్య వెయ్యి దాటిపోయింది. అంతేకాదు ఇదంతా కూడా ప్రభుత్వం సహకారంతో సాగిందని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
సుమారు 30 క్రీడల్లో రష్యా అథ్లెట్లు కావాలనే నిషిధిత ఉత్ప్రేరకాలు వాడారని డోపింగ్పై విచారణ చేస్తున్న కెనడా లాయర్ రిచర్డ్ మెక్లారెన్ తెలిపాడు. ఈ కుట్రలో వీరంతా భాగస్వాములేనని ఆయన స్పష్టం చేశారు. డోపింగ్ కుంభకోణం బయటపడిన తర్వాత వందలమంది రష్యా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లను రియో ఒలింపిక్స్లో పాల్గొనకుండా నిషేధించిన సంగతి తెలిసిందే.
సోచి వింటర్ ఒలింపిక్స్ 2014, లండన్ ఒలింపిక్స్, ఇతర ప్రపంచ స్థాయి టోర్నీల్లో పాల్గొనేందుకు వీళ్లంతా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నారని ఆయన వివరించారు. తాజా నివేదిక నేపథ్యంలో 2012 ఒలింపిక్స్లో పాల్గొన్న రష్యా క్రీడాకారులందరి శాంపిల్స్ను మరోసారి పరీక్షించాలని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిర్ణయించింది.
రష్యన్ అథ్లెట్లపై తీవ్రస్థాయిలో మండిపడిన మెక్లారెన్ తన తాజా నివేదికలో నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకోవడంలో ఆయా రాష్ర్టాల హస్తం కూడా ఉందని ఆరోపించాడు. రెండు సంవత్సరాల క్రితం సోచిలో వింటర్ ఒలింపిక్స జరిగిన సంగతి తెలిసిందే. సోచిలో వింటర్ ఒలింపిక్స్ శాంపిల్స్ను మార్చడానికి కాఫీ, ఉప్పును కలిపారని వెల్లడించాడు.
అంతర్జాతీయ నిపుణులు వీటిని పరీక్షించినప్పుడు ఈ విషయం బయటపడింది. సమ్మర్, వింటర్, పారాలింపిక్స్లో డోపీలుగా రష్యాకు చెందిన దాదాపు వెయ్యి మంది అథ్లెట్లు ఇలా చేశారు. దీని వల్ల వారిలో కొందరు పతకాలు సాధించారని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సమాఖ్య (వాడా)కు అందజేసిన నివేదికలో మెక్లారెన్ పేర్కొన్నాడు.
సమ్మర్, వింటర్ ఒలింపిక్స్కు సంబంధించిన 695 మంది అథ్లెట్ల సమాచారాన్ని ఆయా క్రీడా సమాఖ్యలకు పంపించమన్నాడు. ఇందులో దిగ్గజ అథ్లెట్లు కూడా ఉండటం విశేషం. ఇదంతా సంస్థాగతంగా, ఓ పద్ధతి ప్రకారం పతకాలు గెలివాలనే వ్యూహాంతో చేస్తున్నారని మండపడ్డాడు.
2011 నుంచే నిషేధిత ఉత్ప్రేరకాలు వాడటం మొదలుపెట్టారని, కానీ విషయం బహిర్గతమవుతుందనే ఉద్దేశంతో అప్పటి క్రీడా మంత్రి విటాలి ముట్కో దీనిని అదుపు చేశారు. ఆ తర్వాత ఇది ఒలింపిక్స్, ఇతర టోర్నీలకు పాకింది. ఈ డోపింగ్ కుంభకోణంలో మంత్రి, ఉపమంత్రితోపాటు సీనియర్ అధికారులు హస్తం ఉందని మెక్లారెన్ వ్యాఖ్యానించారు.