కరాచీ: పాకిస్థాన్ స్పిన్నర్ రెజా హసన్(22) మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే నిషేధిత ఉత్ప్రేరకం కొకైన్ వాడి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేత రెండేళ్ల నిషేధం ఎదుర్కొంటున్న హసన్.. తాజాగా ఓ రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డాడు.
ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్లో అల్కాహాల్ తీసుకోవడం నిషేధం, ఎవరైనా తీసుకుంటే కఠినమైన శిక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. లాహోర్లోని ఓ హోటల్లో కొంతమంది వ్యక్తులతో కలిసి అల్కాహాల్ సేవిస్తూ, డ్యాన్సర్లతో కలిసి చిందులు వేస్తూ రెజా హసన్ దొరికిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.
హసన్ ఇప్పటి వరకు 10 ట్వంటీ20 మ్యాచులు, ఒక అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు. నిషేధిత ఉత్ప్రేరకం కొకైనా ఉపయోగించి దొరికిన హసన్.. ఇప్పటికే రెండేళ్లపాటు నిషేధానికి గురయ్యాడు. గత జనవరిలో పెంటంగూలర్ కప్ వన్డే టోర్నమెంటు సందర్భంగా డోపింగ్ టెస్టులో హసన్ దొరికిపోయాడు.
మలేషియాలోని వాడా ల్యాబోరేటరీ పరీక్షించడంతో హసన్ డ్రగ్స్ ఉపయోగించినట్లు తేలింది. దీంతో అతనిపై రెండేళ్లపాటు నిషేధం పడింది. కాగా, తాజా ఘటనతో తమ ముందు విచారణకు హాజరుకావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ నియమించిన ఇద్దరు సభ్యులు కమిటీ రెజా హసన్కు నోటీసులు జారీ చేసింది.