న్యూఢిల్లీ: దక్షణి కొరియాలోని ఇంచియాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2014లో పారా స్విమ్మర్ శరత్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఈవెంట్లో అత్యధిక పతకాలు నెగ్గిన భారతీయడిగా అవతరించాడు. గతంలో జరిగిన 1986 ఆసియా క్రీడల్లో పీటీ ఉష 5 పతకాలు సాధించగా.. ఇప్పుడు ఇంచియాన్ క్రీడల్లో శరత్ 6 పతకాలు సాధించి రికార్డును బద్దలు కొట్టాడు.
ముందుగా 200మీ వ్యక్తిగత మెడ్లీలో రజతం సాధించాడు శరత్, ఆ తర్వాత 100మీ బటర్ ఫ్లయ్, 100మీ బ్రెస్ట్ స్ట్రోక్, 100మీ బ్యాక్ స్ట్రోక్, 50 మీ ఫ్రీస్టయిల్ అంశాల్లో కాంస్య పతకాలు సాధించాడు. అనంతరం, ప్రశాంత్ కర్మాకర్, స్వప్నిల్ పాటిల్, నిరంజన్ ముకుందన్ లతో కలిసి 4X100 మీటర్ల మెడ్లీ రిలే అంశంలో కాంస్యం పతకాలు నెగ్గాడు.
ఇంచియాన్లో జరుగుతున్న క్రీడల్లో తన ప్రదర్శనపై శరత్ మాట్లాడుతూ, ఎంతో సంతోషంగా ఉందని, ఆర్నెల్లుగా కఠోరంగా శ్రమించానని తెలిపాడు. దానికి ఇప్పుడు ఫలితం రావడంతో చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.
ఇన్ని రోజులుగా తనకు మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులు, కోచ్ జాన్ క్రిస్టోఫర్, జోవో స్పోర్ట్స్ ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపాడు. 2012లో లండన్లో జరిగిన పారాలింపిక్స్ లో కూడా శరత్ పాల్గొన్నాడు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల వంటి భారీ ఈవెంట్లు ముగిసిన వెంటనే, వికలాంగులకు పోటీలు నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది. ఈ పోటీలను పారా ఒలింపిక్స్, పారా ఏషియాడ్గా పిలుస్తారు.