సిడ్నీ: ఆసిస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూగ్ మృతి నేపథ్యంలో ఆయనకు బంతి విసిరిన సీన్ అబాట్ తీవ్ర ఆవేదనకు లోనవుతున్న విషయం తెలిసిందే. నీ తప్పేం లేదంటూ సహచరులు, సీనియర్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. మృతి చెందిన హ్యూగ్ సోదరి మెగాన్ కూడా అబోట్ను ఊరడించారు.
హ్యూస్ మరణానికి కారణమైన బౌన్సర్ను విసిరిన అబోట్ ఇప్పుడు జీవితకాల వేదనతో సతమతమవుతున్నాడు. తన తప్పేమీ లేకపోయినా, అపరాధ భావన అతడిని పట్టి పీడిస్తోంది. హ్యూస్ మృతి చెందిన విషయం తెలిసి, అతను ఆసుపత్రిలో ఏడుస్తూ తిరిగాడు.
ఇలాంటి సమయంలో అందరితో పాటు హ్యూస్ సోదరి కూడా అతనిని ఊరడించే ప్రయత్నాలు చేశారు. గురువారం నాడు హ్యూస్ మరణవార్త విన్న వెంటనే సిడ్నీ ఆసుపత్రికి వెళ్లిన అబోట్ను అక్కడే ఉన్న మేగాన్ కలిసింది. అతడితో సుదీర్ఘంగా మాట్లాడి, ఊరట ఇచ్చే ప్రయత్నాలు చేశారు.
కాగా, భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్లో డిసెంబర్ 4 నుంచి తొలి టెస్టు జరగాల్సి ఉంది. బాధాకరమైన పరిస్థితుల్లో ఆస్ట్రేలియా యువ బ్యాట్స్మన్ ఫిలిప్ హ్యూస్ మరణించడంతో ఇరు జట్ల ఆటగాళ్లు విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లు తమ సహచరుడు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
దీనిపై, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు స్పందిస్తూ.. తమ ఆటగాళ్లు ఇంకా కోలుకోలేదన్నారు. దీంతో, తొలి టెస్టు నిర్వహణపై సందేహ ఛాయలు అలుముకున్నాయి. అటు, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా తొలి టెస్టును రద్దు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు, ఆస్ట్రేలియా ఎలెవన్ జట్ల మధ్య జరగాల్సిన రెండ్రోజుల ప్రాక్టీసు మ్యాచ్ ఇప్పటికే రద్దయింది.