కోల్కతా: టీమిండియా మాజీ ఆటగాడు, స్టైలిష్ బ్యాట్స్మన్ వివియస్ లక్ష్మణ్ షర్ట్ (చొక్కా) గురువారం రద్దయిన దక్షిణాఫ్రికా-ఇండియా ట్వంటీ20 మ్యాచులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ ఆలస్యమైన సమయంలో టీవీ స్టూడియోలో అతని షర్ట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో వివిఎస్ లక్ష్మణ్ వేసుకున్న షర్ట్పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టీమిండియా ఆటగాళ్లు సైతం లక్ష్మణ్ వేసుకున్న షర్ట్పై తెగ కామెంట్లు చేశారు.
కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నీలి రంగుపై పిచ్చుకలు కూర్చున్నట్లు ముద్రించి ఉన్న చొక్కా వేసుకున్నాడు లక్ష్మణ్. దీంతో సహ కామెంటేటర్లు దానిపై ముచ్చటపడుతూ నవ్వుకోవడంతో అది ఆగిపోలేదు. భారత జట్టు ఆటగాళ్లకు కూడా అది కొత్తగా అనిపించడంతో మాజీ ఆటగాడిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అల్లరి పనుల్లో ముందుండే హర్భజన్ అయితే ఓ ప్లా కార్డుపై 'లక్ష్మణ్ వీ లవ్ యూవర్ షర్ట్( లక్ష్మణ్, మీ షర్ట్ మాకెంతో నచ్చింది'' అంటూ రాసి నవ్వూతు నిలబడ్డాడు. కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ సహా ఆటగాళ్లంతా అతనితో జత కలిసి అద్భుతం అన్నట్లు సంకేతాలు చూపించారు.