విష్ణువర్దన్తో కలిసి ఆడనున్న పేస్
ఈ మ్యాచ్లో లియాండర్ పేస్, విష్ణువర్దన్తో కలిసి ఆడనున్నాడు. నిజానికి సాకేత్ మైనేనితో జత కట్టాల్సి ఉన్నా.. గతనెల చెన్నై ఓపెన్ సందర్భంగా కాలి గాయానికి గురైన సాకేత్ ఇంకా కోలుకోకపోవడంతో విష్ణుకు అవకాశం దక్కింది. పేస్-విష్ణు జోడీ శనివారం కివీస్ జంట ఆర్టెమ్ సిటాక్-మైకేల్ వీనస్తో తలపడనుంది. లండన్ ఒలింపిక్స్లో విష్ణుతో కలిసి పేస్ డబుల్స్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే.
సింగిల్స్ బరిలో యుకీ భాంబ్రీ, రామ్కుమార్
యుకీ భాంబ్రీ, రామ్కుమార్ రామనాథన్లు సింగిల్స్ బరిలో ఉన్నారు. శుక్రవారం జరిగే సింగిల్స్ పోరులో ప్రస్తుతం 368వ ర్యాంకులో ఉన్న యుకి తొలి సింగిల్స్లో ఫిన్ టియర్నె (414వ ర్యాంకు)తో తలపడనున్నాడు. మరో సింగిల్స్లో రామ్కుమార్ రామనాథన్ (206).. జోస్ సాంథమ్ (417)తో పోటీపడనున్నాడు. ర్యాంకులు, ఫామ్ను బట్టి చూస్తే కివీస్పై భారత్దే పైచేయిగా కనిపిస్తోంది.
ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న భారత్
ఇదిలా ఉంటే డేవిస్ కప్లో ఈసారి భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నది. కివీస్తో ముఖాముఖి రికార్డులో భారత్ 5-3తో ముందంజలో ఉంది. 1978 తర్వాత న్యూజిలాండ్తో నాలుగుసార్లు తలపడితే భారత్ ఒక్కసారి కూడా ఓడలేదు. 2002, 2003, 2004, 2012లో కివీస్పై భారత్ గెలుపొందింది. చివరిగా 2012లో చండీగఢ్లో జరిగిన పోరులో ఈ రెండు జట్లు తలపడగా భారత్ 5-0తో కివీస్ను చిత్తుగా ఓడించింది.
లియాండర్ పేస్ కీలకపాత్ర
అప్పటి జట్టును గెలిపించడంలో వెటరన్ హీరో లియాండర్ పేస్ కీలకపాత్ర పోషించాడు. అప్పట్లో మహేశ్ భూపతితో కలిసి డబుల్స్తో పాటు సింగిల్స్లోనూ పేస్ మ్యాచ్లు గెలువడం విశేషం. మరోవైపు సాకేత్ మైనేనికి గాయం కావడంతో అతని స్థానంలో ఉత్తమ ర్యాంకు ఉన్న రోహన్ బోపన్న.. పేస్కు జతగా బరిలో దించుతారని అనుకున్నారు.
రోహన్ బోపన్నను చేయకపోవడంపై కెప్టెన్ ఆనంద్ అమృత్రాజ్
సాకేత్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఇతనిస్థానంలో రోహన్ బోపన్నను ఎందుకు ఎంపికచేయలేదు? డబుల్స్లో భారత నంబర్వన్ ఆటగాడైన బోపన్నను కాదని ద్వితీయశ్రేణి క్రీడాకారుడైన విష్ణు వర్ధన్ను లియాండర్తో జతకట్టించడంలో ఆంతర్యమేంటి? అసలేం జరిగింది? అనే విషయంలో తమకేమీ తెలియదని భారత జట్టు కెప్టెన్ ఆనంద్ అమృత్రాజ్ చెబుతున్నాడు.