హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ జోన్ ఏలో భాగంగా మంగళవారం జరిగిన మరో మ్యాచ్లో పుణెరి పల్టాన్ జట్టు 34-17 స్కోరుతో బెంగాల్ వారియర్స్ను చిత్తుగా ఓడించింది. పుణెరి తరఫున డిఫెండర్లు సందీప్ నర్వాల్ 7, గిరీష్ ఎర్నాక్ 4 పాయింట్లు సాధించగా రైడర్ మోరె 6 పాయింట్లతో రాణించారు.
ఈ మ్యాచ్లో తొలి అర్ధభాగం నుంచే పల్టన్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. పది నిమిషాల ఆట పూర్తయ్యేసరికి రెండు జట్లు 5-5తో సమంగా నిలిచాయి. అయితే పుణెరి క్రమంగా జోరు పెంచింది. 15వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 12-5తో ఆధిక్యం సంపాదించింది.
ఇక రెండో అర్ధభాగంలో 17-10తో ఆధిక్యంలో నిలిచిన పుణెరి.. తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. మరోసారి బెంగాల్ను ఆలౌట్ చేసింది 24-11తో ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి వరకు అదే జోరును ప్రదర్శించింది. బెంగాల్ ఆటగాడు జాంగ్ కున్ లీ కేవలం ఒకే పాయింట్తో సరిపెట్టుకోవడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది.
బెంగాల్ తరఫున రైడర్ మణిందర్ సింగ్ 6, డిఫెండర్ రణ్సింగ్ 7 రైడింగ్ పాయింట్లు సాధించారు. ఈ మ్యాచ్లో పుణెరి పల్టాన్ జట్టు 15 రైడింగ్, 10 ట్యాకిల్, 4 ఆలౌట్, 5 ఎక్స్ట్రా పాయింట్లు సాధించగా బెంగాల్ జట్టు10 రైడింగ్, 6 ట్యాకిల్, 1 ఎక్స్ట్రా పాయింట్లు చేసింది.