హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కబడ్డీలోకి అడుగుపెట్టాడు. వివో ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో కొత్తగా చేరబోయే చెన్నై జట్టుకి సహా యజమాని అయ్యాడు. జులై నుంచి అక్టోబర్ వరకు జరిగే ఐదో సీజన్లో తమిళనాడుతోపాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా జట్లు కొత్తగా పాల్గొంటున్నాయి.
అయితే ఆయా జట్ల పేర్లను ఇంకా ఖరారు చేయలేదు. తమిళనాడుకు చెందిన ప్రాంచైజీకి ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్తో పాటు సచిన్ సహ యజమానిగా ఉన్నారు. ఇక మిగతా మూడు జట్లకు జేఎస్డబ్ల్యూ, అదానీ గ్రూప్, జీఎంఆర్ గ్రూప్ ఓనర్లుగా ఉన్నారు.
ఐదో సీజన్కు భారత్లోని టాప్ కార్పొరేట్స్ చేరడం సంతోషంగా ఉందని స్టార్ ఇండియా చైర్మన్, సీఈవో ఉదయ్ శంకర్ అన్నారు. కొత్త జట్ల చేరికతో దేశంలోని మిగతా అన్ని స్పోర్ట్స్ లీగ్స్ను ప్రొ కబడ్డీ లీగ్ వెనక్కి నెట్టేస్తుందని ఆయన తెలిపారు.
మొత్తంగా 11 రాష్ట్రాలు, 130కిపైగా మ్యాచ్లు, 13 వారాలు సాగే టోర్నీగా వివో ప్రో కబడ్డీ లీగ్ నిలుస్తుందని అన్నారు. ఇప్పటికే ఈ లీగ్లో 8 ఫ్రాంచైజీలు ఉన్న సంగతి తెలిసిందే. గత నాలుగు సీజన్లలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్, పాట్నా, పుణె, జైపూర్ జట్లు పాల్గొన్నాయి.
జులైలో ఐదో సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో నాలుగు ప్రాంఛైజీలను లీగ్ నిర్వహకులు చేర్చారు. ఇటీవలే ఐదేళ్ల కాలానికి గాను ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ స్పాన్సర్ హక్కులను వివో ఇండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.