మూడు నెలలు.. కెవ్వు కబడ్డీ...
సుదీర్ఘంగా 13 వారాలపాటు జరగనున్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 5లో మన కబడ్డీ మాస్ మహరాజ్లు.. అభిమానులతో ‘కెవ్వు కబడ్డీ' అనిపించనున్నారు. శుక్రవారం తమిళ్ తలైవాస్- తెలుగు టైటాన్స్ మ్యాచ్తో మూడు నెలలు పండుగకు తెరలేవనుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ సిద్ధంకండి.
ప్రో కబడ్డీ లీగ్ 2017 సీజన్ 5కు సంబంధించి మరిన్ని విశేషాలు.. మీకోసం
సరికొత్త టీమ్లతో ‘లే.. పంగా..'
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సరికొత్త సీజన్.. సమరోత్సాహంతో.. కొత్త ఫార్మాట్.. సరికొత్త టీమ్లతో ‘లే.. పంగా..' అంటూ మరోసారి దూసుకొచ్చింది. నాలుగు సీజన్లతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన పీకేఎల్.. పవర్ఫుల్ ‘పాంచ్'తో కబడ్డీ అభిమానులు ఉర్రూత లూగించనుంది. శుక్రవారం ఆరంభంకానున్న మెగా లీగ్ 5వ అంచె సుదీర్ఘంగా 13 వారాలపాటు జరగనుంది. ఈ నెల 28న మొదలయ్యే లీగ్.. అక్టోబర్ 28న జరిగే ఫైనల్తో ముగియనుంది. గతంలో ఉన్న 8 టీమ్లతోపాటు ఐదో సీజన్లో మరో నాలుగు జట్లు అదనంగా చేరాయి. తమిళ్ తలైవాస్, గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్, యూపీ యోద్ధా, హర్యానా స్టీలర్స్ కొత్తగా లీగ్లోకి వచ్చాయి. దీంతో మొత్తం 12 జట్లతో దేశంలోనే అతిపెద్ద లీగ్గా ప్రొ కబడ్డీ అవతరించింది.
ఐపీఎల్ తరహాలో.. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్స్
ప్రో కబడ్డీ లీగ్ లో జట్ల సంఖ్య పెరగడంతో తాజా సీజన్ 5లో ఫార్మాట్లో కూడా మార్పులు చేశారు. ఐపీఎల్ తరహాలో క్వాలిఫయర్స్, ఎలిమినేటర్స్ ప్రవేశపెట్టారు. మొత్తం 12 జట్లను రెండు జోన్లు.. ఎ, బి గ్రూప్లుగా విభజించారు. జోన్లో టాప్-3లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి.
సచిన్ జట్టుతో.. గచ్చిబౌలి స్టేడియంలో.. తొలి మ్యాచ్
ప్రో కబడ్డీ మెగాలీగ్ సీజన్ 5 ఆరంభానికి హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికైంది. తొలి మ్యాచ్.. గ్రూప్-బిలో లీగ్లోకి కొత్తగా చేరిన మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జట్టు తమిళ్ తలైవాస్తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. మొత్తం 11 రాష్ట్రాల్లో లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి.
రూ.46.99 కోట్లతో 227 మంది ఆటగాళ్లు...
గురువారం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో 12 జట్ల కెప్టెన్లు పాల్గొని సందడి చేశారు. ఈ లీగ్ కోసం ఫ్రాంచైజీలు ఎన్నడూ లేనంతగా రూ. 46.99 కోట్లు వెచ్చించి 227 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. డిఫెండింగ్ చాంప్ పట్నా పైరేట్స్ వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించి ప్రో కబడ్డీ లీగ్లో అదరగొట్టింది. అంతకుముందు 2014లో జరిగిన తొలి టైటిల్ను ‘జైపూర్ పింక్ పాంథర్స్' సొంతం చేసుకోగా.. రెండో టైటిల్ను ‘యు ముంబా' జట్టు ఎగరేసుకుపోయింది.
ఇదీ లీగ్ ఫార్మాట్...
మొత్తం 12 జట్లు పాల్గొంటున్న లీగ్లో టీమ్లను ఎ, బి జోన్లుగా విభజించా రు. ఈ రెండు జోన్లలో కలిపి మొత్తం 138 మ్యాచ్లు జరగనున్నాయి. ఫైనల్ చేరే క్రమంలో మూడు క్వాలిఫయర్, రెండు ఎలిమినేటర్ మ్యాచ్లు ఉంటాయి.
ఎ-జోన్: దబాంగ్ ఢిల్లీ, గుజరాత్, పార్చ్యూన్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టన్స్, యు ముంబా.
బి-జోన్: బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్, తెలుగు టైటాన్స్, యూపీ యోద్ధా.
సూపర్ ప్లేఆఫ్స్: జోన్లలో తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లు ‘సూపర్ ప్లే ఆఫ్స్'కు చేరుకుంటాయి.
క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2లో నెగ్గిన జట్ల మధ్య ఎలిమినేటర్-1 జరుగుతుంది.
క్వాలిఫయర్-3లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకోగా.. ఓడిన జట్టు ఎలిమినేటర్-1లో నెగ్గిన జట్టుతో ఎలిమినేటర్-2లో తలపడుతుంది. ఈ రెండు జట్లలో గెలిచిన టీమ్ మళ్లీ ఫైనల్కు చేరుకుంటుంది.
తెలుగు టైటాన్స్...టైటిల్ నెగ్గాలని...
కబడ్డీని తెలుగు ప్రజలకు చేరువ చేసిన జట్టు ‘తెలుగు టైటాన్స్'. ప్రో కబడ్డీ లీగ్ ఆరంభం నుంచి తెలుగు టైటాన్స్ మంచి ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటున్నది. లీగ్ ‘పోస్టర్ బాయ్' రాహుల్ చౌదరి ఈ జట్టు సొంతం. అయితే గత నాలుగు సీజన్లలో టైటాన్స్ ఒక్కసారి కూడా ఫైనల్కు చేరుకోలేదు. తొలి లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు ఐదో స్థానంలో నిలిచినా.. 2015లో మూడో స్థానం సాధించింది. మూడో సీజన్లో మళ్లీ ఐదో స్థానానికి పడిపోగా, సీజన్ 4 లో నాలుగో స్థానం సాధించింది. తాజా సీజన్ 5లో డిఫెన్స్ లో తన బలహీనతను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో తెలుగు టైటాన్స్ గెలుపుపై ఆశలు బాగా పెరిగాయి.
ఇవీ హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ ల వివరాలు...
28 జూలై తెలుగు టైటాన్స్ x తమిళ్ తలైవాస్ (రా 8 గం.కు)
28 జూలై యు ముంబా x పుణెరి పల్టన్ (రా 9 గం.కు)
29 జూలై జైపూర్ పింక్ పాంథర్స్ x దబాంగ్ ఢిల్లీ
29 జూలై తెలుగు టైటాన్స్ x పట్నా పైరేట్స్
30 జూలై యు ముంబా x హర్యానా స్టీలర్స్
30 జూలై తెలుగు టైటాన్స్ x బెంగళూరు బుల్స్
1 ఆగస్టు గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ x దబాంగ్ ఢిల్లీ
1 ఆగస్టు తెలుగు టైటాన్స్ x యూపీ యోద్ధా
2 ఆగస్టు గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ x హర్యానా స్టీలర్స్
2 ఆగస్టు తెలుగు టైటాన్స్ x బెంగాల్ వారియర్స్
3 ఆగస్టు తెలుగు టైటాన్స్ x పట్నా పైరేట్స్