న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్తో మాట్లాడినందుకు విదర్భ క్రికెటర్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అజరుద్దీన్తో మాట్లాడడం ద్వారా అవినీతి నిరోధక నియమాలను ఉల్లంఘించారనేది బిసిసిఐ ఆగ్రహానికి కారణం. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీపై జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచులో కొంత మంది విదర్భ ఆటగాళ్లు అజర్తో మాట్లాడారు.
అజరుద్దీన్తో విదర్భ ఆటగాళ్లు మాట్టాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిసిసిఐ ఢిల్లీ, జిల్లా క్రికెట్ సంఘం (డిడిసిఎ)కు ఏ లేఖ రాసింది. అజరుద్దీన్తో మాట్లాడినవారిలో ప్రముఖ ఆటగాళ్లు వసీం జాఫర్, ఎస్ బద్రీనాథ్లతో పాటు చీఫ్ కోచ్ పరస్ మెహబ్రే ఉన్నారు. డిడిసిఎ ఉపాధ్యక్షుడు చేతన్ చౌహాన్ ఆహ్వానం మేరకు అజరుద్దీన్ ఇక్కడికి వచ్చారు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజరుద్దీన్పై విధించిన నిషేధాన్ని బిసిసిఐ ఇప్పటి వరకు ఎత్తేయలేదు. ఆ విషయంపై బిసిసిఐ నుంచి తమకు లేఖ అందిందని, అయితే అది కాస్తా అయోమయంగా ఉందని చేతన్ చౌహన్ అన్నారు.
ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల ఏరియా (పిఎంఓఎ)లో అజరుద్దీన్తో ఆటగాళ్లు ఎలా మాట్లాడుతారని బిసిసిఐ అడిగింది. ఆ ఏరియాలో సెలెక్టర్లు వినయ్ లాంబా, హరి గిద్వానీ, డిడిసిఎ అధికారులు కూర్చున్నారు. అజర్ కూడా అక్కడే కూర్చున్నారు. అజర్తో ఆటగాళ్లు మాట్లాడకూడదంటే తాము కాస్తా జాగ్రత్తగా ఉండేవాళ్లమని చౌహాన్ అన్నారు.
ఎసియు అధికారులు ఆ విషయాన్ని మ్యాచ్ జరుగుతున్న సమయంలో మ్యాచ్ రెఫరీ రాజేంద్ర జడేజాతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అజర్తో మాట్లాడేటప్పటికీ జాఫర్, బద్రీనాథ్ అవుట్ కావడమే కాకుండా డ్రెసింగ్ రూం నుంచి ట్రైనింగ్ యూనిఫామ్ల్లో బయటకు వచ్చారు.
అజరుద్దీన్ చౌహాన్, గిద్వానీ, లాంబాలతో పాటు కూర్చుని ఉండడం గమనించి వారిద్దరు కూడా అజరుద్దీన్తో మాట్లాడారు.