బెంగుళూరు: యువరాజ్ సింగ్పైకి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓపెనర్ క్రిస్ గేల్ బ్యాటెత్తాడు. కోపంగా కాదు.... సరదాగానే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఆదివారం నాడు ఢిల్లీ డేర్ డెవిల్స్తో బెంగుళూరు తలపడింది. ఇరు జట్లు మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది.
దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు పిచ్ నుంచి వెనుదిరుగుతున్నారు. ఈ సందర్భంలో మైదానంలో క్రిస్ గేల్, యువరాజ్ల మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. యువరాజ్పై క్రిస్ గెల్ బ్యాటెత్తి కొట్టబోగా, యువరాజ్ తప్పించుకుంటూ పరుగెత్తాడు. ఈ సరదా సన్నివేశాన్ని స్టేడియానికి వచ్చిన అభిమానులు ఆసక్తిగా తిలకించారు.
ఇక ఆదివారం బెంగళూరు-ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అంఫైర్లు ఇరు జట్లకూ చెరో పాయింట్ కేటాయించారు. దీంతో మొత్తం 16 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు ప్లేఆఫ్కు అర్హత సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 187 పరుగులు చేసింది.
డికాక్ 69 పరుగులు, జేపీ డుమినీ 67 పరుగులతో చెలరేగారు. హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 1.1 ఓవర్లలో 2/0తో స్కోరుతో ఉన్న సమయంలో వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు.