న్యూఢిల్లీ: నిరుటి ఐపియల్ సీజన్లో నిబంధనల ఉల్లంఘన ఘోరంగా జరిగిన వైనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఐపియల్ 8 టోర్నీ సందర్భంగా కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఐపియల్ 7 టోర్నీలో క్రికెట్ క్రీడా వివాదాలకు నిలయంగా మారింది. భారత క్రికెట్ను స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం కుదిపిసేన విషయం తెలిసిందే.
గత ఐపియల్ సీజన్లో బీసీసీఐ, ఐపీఎల్ నిబంధనలకు తిలోదకాలిస్తూ తమ ఆటగాళ్లకు భారీ విందు వినోదాలు ఏర్పాటు చేశాయని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనం సంచలనం రేకెత్తించింది. బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ఏసీఎస్యూ) చీఫ్ రవి సవానీ బోర్డు కార్యాలయానికి పంపిన ఈ-మెయిల్లో ప్రస్తావించిన ఈ విషయాలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయని ఆ వార్తాపత్రిక కథనం తెలిపింది.
ఐపీఎల్ జట్లు, టోర్నీ ప్రొటోకాల్ను, బోర్డు అవినీతి వ్యతిరేక కోడ్ను ఉల్లంఘించిన పలు ఘటనలను సవానీ తన మెయిల్లో ప్రస్తావించారని చెప్పింది. వాటిలో ప్రధానమైనవి - ప్రీతి జింటాకు చెందిన కింగ్స్ ఎలెవన్ జట్టు యాచ్ పార్టీలో చిందులేయడం, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుల గదిలో ఓ యువతి రాత్రంతా ఉండడం, కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారూక్ ఖాన్ జట్టు సభ్యులకు ఆయన మిత్రుడు ముందస్తు అనుమతి లేకుండా విందు ఇవ్వడం.
బెట్టింగ్కు పాల్పడుతున్నాడన్న అనుమానంతో ఏసీఎస్యూ నిఘా ఉంచిన వ్యక్తికి చెందిన యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ సహ యజమాని ప్రీతీ జింతా నిరుడు ఏప్రిల్ 30వ తేదీన తమ జట్టుకు యాచ్ పార్టీ ఇచ్చిందని తెలిపింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్కు చెందిన ఆటగాడి గదిలో ఒక అమ్మాయి రాత్రంతా ఉందట. 2014 ఏప్రిల్ 8వ తేదీన ముంబైలోని ఐటీసీ గ్రాండ్ మౌర్య హోటల్లో ఉన్న చెన్నై ఆటగాడి గదిలోకి రాత్రి 9.30 గంటలకు వెళ్లిన ఓ యువతి మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు బయటకొచ్చిందని ఆంగ్ల దినపత్రిక తన కథనంలో తెలిపింది.
అయితే ఆమె తన స్నేహితురాలని, తామిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని సదరు ఆటగాడు చెప్పాడని నివేదిక చెప్పినట్లు రాసింది. అయితే, ఆ యువతి బీసీసీఐ నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్తో పాటు వివిధ ఫ్రాంచైజీలకు చెందిన కొందరు సీనియర్ ఆటగాళ్లతోనూ టచ్లో ఉన్నట్టు ఏసీఎస్యూ వెల్లడించింది. ఇలా ఆటగాళ్ల గదుల్లోకి అమ్మాయిలు వస్తున్నారని తమకు చాలా ఫిర్యాదులు అందాయని తెలిపింది.
అదే ఏడాది ఏప్రిల్ 9న ఢిల్లీలోని జేడబ్ల్యూ మారియట్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు విందులో పాల్గొందని ఆంగ్ల పత్రిక చెప్పింది. ఈ విందుకు ఢిల్లీ ఫ్రాంచైజీ ఆహ్వానించిన వంద మందికిపైగా బయటి వ్యక్తులు, ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని కలిశారని తెలిపింది. గత టోర్నీలో సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన ఇద్దరు ఆటగాళ్లను ఆ జట్టు బసచేసిన హోటల్లో చాలామంది బయటి వ్యక్తులు కలిశారని సవానీ తన మెయిల్లో ప్రస్తావించినట్టు స్పష్టం చేసింది. కాగా ఇవన్నీ నిరుడు జరిగిన ఘటనలని, వాటిని అప్పుడే ముగించామని పంజాబ్ ఫ్రాంచైజీ ప్రతినిధి అన్నారు.