న్యూఢిల్లీ: రహదారులపై ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వాళ్లని చూస్తే భయమేస్తోందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. వారు పాదచారులను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని అన్నారు. న్యూఢిల్లీలో 'రహదారి భద్రత'పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సచిన్ మాట్లాడారు.
రోడ్డు ప్రమాదాల్లో వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తుండటం బాధాకరమన్నారు. మైదానంలో క్రీజులోని బ్యాట్స్మెన్, నాన్స్ట్రైక్ ఎండ్లోని బ్యాట్స్మెన్కు మధ్య సమన్వయం కుదిరినప్పుడే మెరుగైన భాగస్వామ్యం లభిస్తుందన్న సచిన్.. వాహనదారులు, పాదచారుల మధ్య కూడా ఇలాంటి సమన్వయమే ఉండాలని సూచించారు.
కొంత మంది ద్విచక్ర వాహనదారులు బండి నడిపే సమయంలో హెల్మెట్ పెట్టుకోకుండా బండికి పెట్టడం లేదా వెనక కూర్చున్న వారు దాన్ని చేత్తో పట్టుకోవడం.. రహదారులపై తాను పరిశీలించానన్నారు. ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని సచిన్ తెలిపాడు.
The fight against unsafe roads with little champions in Delhi.#iPledge to encourage people to drive safely @DrMoopen pic.twitter.com/EQctxQkeAG
— sachin tendulkar (@sachin_rt) February 7, 2016
పాదచారులు, వాహనదారులు రహదారులపై జాగరూకతతో వ్యవహరించి ప్రమాదాలను అరికట్టాలని టెండూల్కర్ సూచించారు. ఈ రకంగా మనం స్వచ్ఛందంగా రూల్స్ను పాటించిన రోజున భారతీయ రోడ్లు అత్యంత సురక్షితమైన రహదారులుగా మారతాయనడంలో ఎటువంటి సందేహం లేదని మాస్టర్ తెలిపాడు. దీనిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సచిన్ పిలుపునిచ్చాడు.