ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పాట పాడాడు. అది కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్తో కలిసి మాస్టర్బ్లాస్టర్ తన గొంతు కలిపాడు.
ప్రధాని నరేంద్రమోడి పిలుపు మేరకు సెలబ్రిటీస్ అంతా కలిసి స్వచ్ఛభారత్ గీతాన్ని రూపొందిస్తున్నారు. ఈ మేరకు రచయిత ప్రసూన్ జోషి రాసిన పాట శంకర్-ఎహసాన్-లాయ్ సంగీత దర్శకత్వంలో గాయకుడు శంకర్ మహదేవన్ తదితరులు స్వరకల్పనలో రికార్డింగ్ చేశారు.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ సైతం రెండు లైన్లను పాడారు. క్లీన్ ఇండియా(స్వచ్ఛ భారత్)కోసం రూపొందిస్తున్న ఈ పాటను అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
కాగా, పౌరుల్లో పరిశుభ్రతపై చైతన్యం కలిగించేందుకు ఈ పాటను ఉపయోగించనున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు పట్టణ అభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు.