ముంబై: క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 42వ పుట్టిన రోజైన శుక్రవారం(ఏప్రిల్ 24)న సామాజిక నెటవర్కింగ్ వేదిక అయిన ఇన్స్టాగ్రాంలో ఖాతా తెరిచాడు. 'నేను ఇప్పుడు అధికారికంగా ఇన్స్టాగ్రాంలో ప్రవేశించాను' అని సచిన్ మొదటి ట్వీట్ చేశాడు.
ఈ ఇన్స్టాగ్రాం వేదిక ద్వారా కూడా ఇక సచిన్ టెండూల్కర్ తన ఫొటోలను, వ్యాఖ్యానాలను అభిమానులతో పంచుకోనున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, యువరాజ్ సింగ్ లాంటి ప్రముఖ ఆటగాళ్లు కూడా ఇన్స్టాగ్రాంలో ఉన్నారు.
కాగా, ట్విట్టర్లో ఇప్పటికే ఖాతా కలిగివున్న సచిన్ టెండూల్కర్కి 80లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఐసిసి ప్రపంచ కప్ 2015 సందర్భంగా టీమిండియాకు మద్దతుగా సచిన్ టెండూల్కర్ పలు సందేశాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన మైకేల్ క్లార్క్, డేనియల్ విట్టోరీలకు సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలిపాడు.
ఇది ఇలా ఉండగా, 42వ ఏటలోకి అడుగుపెడుతున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్కు అభిమానులు, ప్రముఖులు సామాజిక అనుసంధాన వేదిక ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. హ్యాపీ బర్త్ డే సచిన్ అంటూ నెట్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.