న్యూఢిల్లీ: భారతరత్న, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ బుధవారం నాడు కేంద్ర క్రీడల శాఖ మంత్రి సోనోవాల్ను కలిశారు. బాక్సర్ సరితా దేవి అంశం పైన ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడారు. తాను కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిశానని, సరితకు మద్దతుగా నిలుస్తామని చెప్పారని తెలిపారు. యావత్ భారత దేశం ఆమె వెంట ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. సరిత క్షమాపణలు చెప్పినందున వివాదం ముగించాలన్నారు.
సరితకు బాక్సర్ విజేందర్ సింగ్ కూడా మద్దతిచ్చారు. కాగా, సచిన్ మద్దతు పట్ల సరిత భర్త తోయిబా సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. సచిన్ మద్దతివ్వడం సంతోషంగా ఉందన్నారు. సరితా దేవి పైన సస్పెన్షన్ ఎత్తివేస్తారని తాను భావిస్తున్నానని ఆశించారు.
కాగా, నిషేధానికి గురైన భారత మహిళా బాక్సర్ సరితా దేవికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాసటగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నిరాకరించి సస్పెన్షన్కు గురైన ఆమెకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలంటూ సచిన్ వారం రోజుల క్రితం ఓ లేఖ కూడా రాశారు.
పతకం నిరాకరించడం పట్ల సరితా దేవి ఇప్పటికే క్షమాపణ చెప్పిందని, ఆమెపై సస్పెన్షన్ను ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకోవాలని క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్కు రాసిన లేఖలో సచిన్ టెండూల్కర్ కోరారు. సరితా దేవికి పూర్తి మద్దతు ఇవ్వాలని, ఆమె కెరీర్ ప్రమాదంలో పడే పరిస్థితి నుంచి కాపాడాలని సచిన్ విజ్ఞప్తి చేశారు.
ఆమెకు మద్దతుగా ప్రభుత్వం నిలబడాలని సచిన్ టెండూల్కర్ కోరారు. కేంద్రమంత్రి నేతృత్వంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, బాక్సింగ్ ఇండియా నుంచి సీనియర్ అధికారులతో టాక్స్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆమెకు మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆసియా క్రీడల బాక్సింగ్లో ఓ బౌట్లో తనకు అన్యాయం జరిగిందంటూ సరితా దేవీ తనకు లభించిన పతకం నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ భాక్సింగ్ సంఘం ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది.