హైదరాబాద్: మాజీ క్రికెటర్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మంగళవారం హైదరాబాద్లో సందడి చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్న సచిన్కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. క్రికెట్ లెజెండ్ ను చూసేందుకు ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో, విమానాశ్రయం క్రికెట్ అభిమానులతో కిటకిటలాడింది.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలిలోని ఇనార్బిట్ మాల్కు చేరుకున్న సచిన్ అక్కడ ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ పార్క్ను ప్రారంభించారు. ఈరోజు రాత్రి 8 గంటలకు జైపూర్ పింక్ పాంతర్స్, తెలుగు టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్ను సచిన్ టెండూల్కర్ వీక్షించనున్నారు.
సచిన్తో పాటు బాలీవుడ్ స్టార్లు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కూడా హైదరాబాద్కు రానున్నట్లు సమాచారం. ప్రో కబడ్డీ లీగ్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరగనున్న మ్యాచ్లకు ఈ ముగ్గురూ ముఖ్య అతిథిలుగా హాజరవుతారు.
భారత్కు చెందిన గ్రామీణ క్రీడాగా ఉన్న కబడ్డీకి ప్రో కబడ్డీ ద్వారా విశేష ప్రాచుర్యం కల్పించడంలో అభిషేక్ బచ్చన్ ముందున్నారు. అంతేకాదు ప్రో కబడ్డీ లీగ్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు యజమాని. భారత్లో ప్రో కబడ్డీకి మంచి ప్రాచుర్యం తెచ్చేందుకు గాను ప్రముఖులను స్టేడియాలకు రప్పిస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ ఆహ్వానం మేరకే సచిన్ టెండూల్కర్ మంగళవారం గచ్చిబౌలిలో జరగనున్న మ్యాచ్లను వీక్షించేందుకు వచ్చారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్డేడియంలో తెలుగు టైటాన్స్ ఏడు మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
ప్రో కబడ్డీలో తెలుగు టైటాన్స్ విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో ఐదింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో కొనసాగుతోంది.