లండన్: ఆల్ ఇంగ్లాండ్ టైటిల్తో స్వప్నం సాకారం చేసుకోవావలనుకున్న సైనా నెహ్వాల్ ఆశ నెరవేరలేదు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్లో మూడో సీడ్ సైనా 21-16, 14-21, 7-21తో ప్రపంచ చాంఫియన్ కరోలినా మారీన్ (స్పెయిన్) చేతిలో ఓటమి పాలైంది.
గంటా 2 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో కరోలినాదే పైచేయిగా సాగింది. తొలి గేమ్ గెల్చుకుని, రెండో గేమ్ దిశగా దూసుకెళ్తున్న సైనా అనూహ్యంగా పట్టు కోల్పోయింది. మొదటి గేమ్లో దూకడుగా ఆడి అలసిపోయిన సైనా రెండో గేమ్లో దెబ్బతింది.
రెండో గేమ్లోనూ అదే దూకుడు కొనసాగించిన సైనా 6-1తో ముందంజ వేసింది. కీలక సమయంలో సైనా వైడ్ షాట్లు, నెట్ వద్ద పొరపాట్లు చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. దీంతో రెండో గేమ్ మారిన్ వశమైంది. నిర్ణయాత్మక మూడో గేమ్లో సైనా కనీస పోరాటం కూడా చేయలేదు. ఇక ఎంత మాత్రం పొరపాట్లకు తావివ్వని మారిన్ 6-2తో ఆధిక్యం సాధించింది.
నిర్లక్ష్యంగా కదిలిన సైనా కొట్టిన షాట్లన్నీ కోర్టు బయటికి వెళ్లాయి. దీంతో 9-4తో ఆధిక్యంలోకెళ్లిన మారిన్ ఆపై వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గి 16-4తో టైటిల్ దిశగా దూసుకెళ్లింది. ఆ తర్వాత సైనా రెండు పాయింట్లు సాధించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఏకాగ్రత కోల్పోవడంతో పాటు అనవసరంగా ఒత్తిడికి లోవనడం ఓటమికి కారణం. అగ్రశ్రేణి క్రీడాకారులతో తలపడేటప్పుడు ఎక్కడో ఒక చోట తప్పుచేస్తాం. ఇప్పుడు అదే జరిగింది. ఏకాగ్రత చెదరడంతో కంగారుపడ్డాను. సరిచేసే క్రమంలో ఒత్తిడికి చిత్తయ్యానని మ్యాచ్ అనంతరం సైనా తెలిపింది.