హైదరాబాద్: మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. క్వార్టర్స్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో చైనా క్రీడాకారిణి ఝాంగ్ యిమాన్ చేతిలో 12-21, 17-21తో ఓటమి పాలైంది. ఝాంగ్ యిమాన్తో తలపడిన సైనా ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
తొలి గేమ్లో సైనాపై 12-21తో ఝాంగ్ విజయం సాధించింది. ఇక రెండో గేమ్లో సైనా ఒకొనొక సమయంలో తన దూడుకుని ప్రదర్శించి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అయితే ఆ సమయంలో ఝాంగ్ అద్భుతంగా పోరాడి సైనా నుంచి విజయాన్ని దూరంగా తీసుకెళ్లింది.
దీంతో 35 నిమిషాల పాటు జరిగిన వరుస గేమ్ల్లో 12-21, 17-21 తేడాతో సైనా ఓటమి పాలైంది. దీంతో మకావు ఓపెన్ మహిళల సింగిల్స్ క్వార్టర్స్ నుంచి సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. మోకాలి శస్త్రచికిత్స తర్వాత సైనా ఆడిన చైనా ఓపెన్, హాంకాంగ్ ఓపెన్లలో నిరాశ పర్చిన సంగతి తెలిసిందే.
దీంతో మకావు ఓపెన్ టైటిల్ను ఎలాగైనా సరే సాధించాలనే పట్టుదలతో బరిలోకి సైనా దిగినా ప్రయోజనం లేకపోయింది. ఇక ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ జాబితాలో సైనా టాప్ 10లో కూడా చోటు దక్కించుకోలేక పోయింది.
బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో సైనా నెహ్వాల్ 11వ ర్యాంకులో కొనసాగుతోంది. గత ఎనిమిదేళ్లలో సైనా టాప్ 10లో స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి. మకావు ఓపెన్ క్వార్టర్స్ నుంచి సైనా నిష్క్రమించడంతో ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్ 10లోకి అడుపుపెట్టే అవకాశాలను కూడా కోల్పోయింది.