హైదరాబాద్: తన మాజీ కోచ్ పుల్లెల గోపీచంద్ పైన హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ మంగళవారం నాడు సెటైర్లు వేశారు. విమల్ సార్ వల్లనే తన ర్యాంక్ మెరుగైందని ఆమె చెప్పారు. గోపీచంద్ అకాడమీలోనే ఉంటే తన ర్యాంగ్ పడిపోయేదని అభిప్రాయపడ్డారు.
విమల్ సార్ వల్లనే తన ర్యాంక్ మెరుగైందన్నారు. కోచ్ను మార్చిన తన నిర్ణయం సరైందేనని ఇప్పుడు రుజువయిందని ఆమె చెప్పారు.
అంతకుముందు మాట్లాడుతూ... ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ రజత పతకాన్ని కోచ్ విమల్, తల్లిదండ్రులు, ఒలిపింక్ గోల్డ్ క్వెస్ట్ కు అంకితమిస్తున్నట్టు సైనా నెహ్వాల్ చెప్పారు.
ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన ఫైనల్స్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా చేతిలో పరాజయం పాలైన సైనా రజత పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇప్పటి వరకు ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో పతకం సాధించిన ఏకైక వ్యక్తి సైనా నెహ్వాల్ కావడం గమనార్హం.