న్యూఢిల్లీ: భారత టెన్నీస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా మరో ఘనత సాధించారు. సానియా మీర్జాను ఐక్యరాజ్యసమితి సుహృద్భావ ప్రచార కర్తగా నియమించింది. దక్షిణాసియాలో మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితితో కలిసి సానియా మీర్జా పని చేయనున్నారు.
ఐక్యరాజ్యసమితి తనకు ఇచ్చిన బాధ్యతను శక్తి మేర నెరుస్తానని సానియా మీర్జా ఈ సందర్భంగా అన్నారు. స్త్రీలపై హింస నిర్మూలనకు అడ్డంకులను ఎదురొడ్డి పోరాడుతానని చెప్పారు. సమాజంలో మహిళలపై వివక్ష కొనసాగుతోందని సానియా అభిప్రాయపడ్డారు. స్త్రీలపై కొనసాగుతున్న వివక్షను రూపుమాపేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. సానియా మీర్జాను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తమ బ్రాండ్ అంబాసిడర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరణ దండన: ఐరాస తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు
మరణదండనను తాత్కాలికంగా రద్దు చేయాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీసుకువచ్చిన ముసాయిదా తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. ఇది దేశ సార్వబౌత్వ హక్కును హరించి వేస్తుందని, అమలులో ఉన్న చట్టాల ప్రకారం నేరస్తులకు శిక్షలు వేయలేమని ఐరాసలో భారత ప్రతినిధి మయాంక్ జోషి వ్యాఖ్యానించారు.
భారత చట్టాలకు ఈ తీర్మానం వ్యతిరేకం అని ఆయన వివరించారు. కాగా, ఈ తీర్మానానికి అనుకూలంగా 114 దేశాలు ఓటు వేయగా, 36 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 34 దేశాలు ఓటింగ్కు గైర్హాజరయ్యాయి.
సానియా, సైనాలకు లోకసభ అభినందనలు
టెన్నిస్ తార సానియా మీర్జా, ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్లకు లోకసభ అభినందనలు తెలిపింది. వారు సాధించిన విజయవాలకు గానూ లోకసభ ఈ మేరకు అభినందనలు తెలిపింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, మామ్ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను కూడా అభినందించింది. తమ తమ రంగాల్లో వీరంతా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటారని ఈ సందర్భంగా లోకసభ పేర్కొంది.