హైదరాబాద్: భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే తీవ్ర ఉత్కంఠ. ఏ దేశానికి సంబంధించిన వారు ఆ దేశం గెలవాలని ఆకాంక్షిస్తుంటారు. అయితే, పుట్టినిల్లు భారత్, మెట్టినిల్లు పాకిస్తాన్ అయిన హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తన ఫేవరేట్ భారత్ అంటున్నారు.
ఇప్పటికే ప్రపంచకప్లో పాకిస్తాన్ పైన భారత్ 5-0తో రికార్డ్ సృష్టించింది. ఈసారి కూడా గెలవాలనుకుంటోంది. సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెటర్. ఈ నేపథ్యంలో భారత్ - పాక్ల మధ్య మ్యాచ్ ఉంటే.. సానియా మాత్రం భారత్ గెలవాలను కోరుకుంటున్నారు. గతంలోను ఆమె ఈ విషయం చెప్పారు.
భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అందరికీ చాలా ఉద్వేగమని, అందులో తాను ఎప్పుడు నేను పుట్టిన భారత్ వైపే ఉంటానని చెప్పింది. రెండు టీవీ చానళ్లకు కామెంట్రీ చెప్పడం కోసం షోయబ్ భారత్లో ఉన్నాడని, అందువల్ల తాను ఒక్కదాన్నే దుబాయ్లో మ్యాచ్ చుస్తున్నట్లు చెప్పారు.
కాగా, ఆదివారం ఉదయం భారత్ - పాక్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. పాక్ ముందు 301 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పాక్ బౌలింగులో సోహైల్ ఖాన్ అయిదు, రియాజ్ ఒక వికెట్ తీశాడు. భారత్ బ్యాటింగులో కోహ్లీ, ధావన్, రైనాలు రాణించారు.