హైదరాబాద్: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా కెరీర్లో అత్యుత్తమ ర్యాంకును సాధించింది. మహిళల డబుల్స్ విభాగంలో మూడో ర్యాంకుకు చేరుకుంది. 6885 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది.
తాజాగా స్విస్ దిగ్గజం మార్టినా హింగిస్తో కలిసి ప్రతిష్ఠాత్మక బీఎన్పీ పారిబస్ ఓపెన్లో డబుల్స్ టోర్నమెంట్లో సానియా టైటిల్ను గెల్చుకుంది. ఈ విజయంతో 1000 పాయింట్లు సంపాదించి డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది.
కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించడం థ్రిల్లింగ్గా ఉందని సానియా మిర్జా సంతోషాన్ని వ్యక్తం చేసింది. నంబర్ వన్గా నిలవాలన్నది తన డ్రీమ్అని, ఏదో ఒకరోజు ఆ స్ధానానికి చేరుకుంటానని ప్రస్తుతం అమెరికాలో ఉన్న సానియా మిర్జా పీటీఐతో చెప్పింది.
స్విస్ దిగ్గజం మార్టినా హింగిస్తో కలిసి ప్రతిష్ఠాత్మక బీఎన్పీ పారిబస్ ఓపెన్లో డబుల్స్ చాంపియన్గా నిలిచి సత్తాచాటింది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టాప్సీడ్ సానియా-హింగిస్ జోడీ ఫైనల్లో 6-3, 6-4తో రష్యన్ ద్వయం ఎకటరీనా మకరోవా-ఎలెనా వెస్నీనాను వరుససెట్లలో చిత్తుచేసి ట్రోఫీ అందుకుంది.
16 గ్రాండ్స్లామ్ టైటిళ్ల (5 సింగిల్స్తో కలిపి) విజేత అయిన 34ఏళ్ల హింగిస్తో జతకట్టిన తొలి ప్రయత్నంలోనే సానియా టైటిల్ సాధించడం విశేషం. ఈ సీజన్లో రెండో టైటిల్ అందుకున్న సానియాకిది ఓవరాల్గా 24వ టైటిల్.
మ్యాచ్ అనంతరం సానియా మిర్జా మాట్లాడుతూ "పేపర్పై చూసినప్పుడు సాధారణంగానే మాది అత్యుత్తమ జోడీగా కనిపిస్తుంది. కానీ కోర్టులోకి దిగాకే తెలిసేది అసలు సత్తా. ఇక్కడ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంటేనే మనపై ఉన్న అంచనాలకు న్యాయం చేసినట్లు. దీన్ని మేం నిజం చేసామనే అనుకుంటున్నా. టోర్నీ మొత్తమ్మీద ఒక్క సెట్ కూడా చేజార్చుకోకుండా టైటిల్ నెగ్గాం. హింగిస్ అద్భుతమైన క్రీడాకారిణి. ఆమెతో కలిసి తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలవడం సంతోషంగా ఉంది" అని తెలిపారు.