హైదరాబాద్: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాకు ఖేల్రత్న ఇవ్వడంపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. తాము స్టే ఎత్తివేసేవరకూ ఆమెకు ఖేల్ రత్న ఇవ్వరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సానియా మిర్జాకు కేంద్ర ప్రభుత్వం ఖేల్రత్న ఇవ్వడంపై పారాలింపిక్ అథ్లెట్ హెచ్ ఎన్ గిరీశ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఆ పిటిషన్ను విచారించిన కర్ణాటక హైకోర్టు కేంద్రం తన అభిప్రాయాన్ని తెలపాలని నోటీసులు జారీ చేసింది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకు సానియా మిర్జా పేరుని సెలక్షన్ ప్యానెల్ ప్రతిపాదించడం 'అన్యాయం' అని 2012 లండన్ పారాలింపిక్స్ పోటీల్లో రజత పతక విజేత గిరీశ హోసనగెరె నాగరాజె గౌడ కేంద్రం తీరుపై తన అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఖేల్ రత్న అవార్డు కోసం కేంద్రం అనుసరించే పాయింట్ల విధానం ప్రకారం తాను 90 పాయింట్లతో రేసులో ముందున్నానని, సానియా మిర్జా నా దరిదాపుల్లో కూడా లేదని తెలిపాడు.
సానియా మిర్జా గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన సంగతి తనకు తెలుసునని, క్రీడా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం 2011 నుంచి జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఏషియాడ్, కామన్వెల్త్ క్రీడలు, వరల్డ్ చాంపియన్ షిప్స్లో ప్రదర్శనలే ఈ అవార్డు కోసం పరిగణనలోకి తీసుకుంటారని వివరించాడు.
"ఇది అన్యాయం. నన్ను వదిలేసి సానియా మిర్జాను ఎంపకి చేశారు. 2012లో నేను పతకం సాధించినప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉన్నారు. నన్ను తొలిగా అభినందించింది ఆయనే" అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
2011-2014 మధ్య సానియా మిర్జా ఏ మెడల్ కూడా గెలవలేదని గిరీశ ఆరోపించారు. నిబంధనల ప్రకారం తనకు 90 పాయింట్లు ఉన్నాయని, తనకే ఖేల్రత్న ఇవ్వాలని గిరీశ డిమాండ్ చేస్తున్నారు.
2014 ఏసియన్ గేమ్స్, యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్లో బంగారు పతకాల్ని సాధించి దేశ గౌరవాన్ని మరింతగా పెంచినందుకు ఖేల్ రత్న అవార్డుకు ఆమెను ప్రతిపాదించినట్లు క్రీడల శాఖ పేర్కొంది. ఈ అవార్డుకి సానియా మిర్జా ఇటీవల సాధించిన మహిళల డబుల్స్ వింబుల్డన్ టైటిల్ను లెక్కలోకి తీసుకోలేదు.