హైదరాబాద్: కెమెరాను ఎదుర్కోవాలంటే తనకు చాలా సిగ్గేస్తోందని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. బాలీవుడ్లో నటించడం పట్ల తనకు ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. కానీ హిందీ సినిమాలు చూడటం మాత్రం తనకు చాలా ఇష్టమని ఆమె తెలిపారు. తనకు హిందీ సినిమాలు చూడటం తప్ప, వాటిలో నటించడం వల్ల కాదన్నారు.
తన వృత్తి అవసరాల మేరకు పొట్టి దుస్తులు ధరిస్తానని సానియా మీర్జా చెప్పారు. మైదానం అవతల మాత్రం తనకు అవి అంత సౌకర్యంగా ఉండవని తెలిపారు. తనకు పొడవైన దుస్తులు, గౌన్లు ధరించడమే తనకు ఇష్టమని తెలిపారు.
కాగా, సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ వివాదాల పైన సానియా మీర్జా కూడా స్పందించారు. తాను హైదరాబాదుకు చెందిన వ్యక్తినని ఆమె తెలిపారు.
ఆసియా గేమ్స్ మిక్స్డ్డ్ డబుల్స్ సాకేత్తో కలిసి స్వర్ణం, డబుల్స్లో ప్రార్దన తోంబ్రేతో కలిసి కాంస్యం సానియా మీర్జా నెగ్గిన విషయం తెలిసిందే. స్వర్ణం గెలుచుకున్న ఆమె తెలంగాణ, భారత దేశానికి అంకితం ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు తాజ్ మహల్ వద్ద వారం రోజుల క్రితం నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. సానియా మంగళవారం ఆగ్రాలోని తాజ్ మహల్ను చూసేందుకు వెళ్లారు. అయితే, ఆమె ఆలస్యంగా రావడంతో అది కుదరలేదు.
అప్పటికే సాయంత్రం కావడం.. సందర్శన సమయం మించిపోవడంతో గేట్లు మూసివేశారు. దీంతో సానియా మీర్జా దూరం నుండే చూసి.. నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. సమయం మించిపోవడంతో ఆమె వచ్చే కంటే ముందే గేట్లు మూసివేసినట్లు టూరిస్ట్ గైడ్ గౌతమ్ తెలిపారు. తాజ్ మహల్ చూసేందుకు మంగళవారం అవకాశం దొరకకపోవడంతో సానియా తీవ్ర నిరాశ పడ్డారు.