న్యూఢిల్లీ: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా పేరుని రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు కేంద్ర క్రీడా శాఖ ప్రతిపాందించింది. శనివారం అవార్డుల కమిటీకి సానియా పేరును కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ ప్రతిపాదన చేశారు.
క్రీడా రంగంలో ఎక్కువ పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సానియా ఉందని, అందుకే ఆమె పేరును ప్రతిపాదిస్తున్నామని క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ అన్నారు.
2014 ఏసియన్ గేమ్స్, యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్లో బంగారు పతకాల్ని సాధించి దేశ గౌరవాన్ని మరింతగా పెంచినందుకు ఖేల్ రత్న అవార్డుకు ఆమెను ప్రతిపాదించినట్లు క్రీడల శాఖ పేర్కొంది. ఈ అవార్డుకి సానియా మిర్జా ఇటీవల సాధించిన మహిళల డబుల్స్ వింబుల్డన్ టైటిల్ను లెక్కలోకి తీసుకోలేదు.
కాగా, సానియా మిర్జాకు 2004లో అర్జున, 2006లో పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం బహుకరించింది. సానియా మిర్జాతో పాటు రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు 11 మంది పోటీ పడ్డారు. ఈ పోటీలో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ తదితరులు ఉన్నారు.