లాహోర్/న్యూఢిల్లీ: సుమారు ఆరేళ్ల విరామం తర్వాత వన్డే ఇంటర్నేషనల్స్లో సెంచరీ సాధించిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్, తన భర్త షోయబ్ మాలిక్కు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభినందనలు తెలియజేసింది. మాలిక్ సెంచరీ చేసి మళ్లీ ఫాంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. జింబాబ్వేతో మంగళవారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో గెలిచింది.
కాగా, 2003 జూన్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్పై వన్డే ఆడిన మాలిక్ చాలాకాలం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. ఆరేళ్ల తర్వాత మళ్లీ సెంచరీ చేశాడు. మాలిక్ ఫామ్లోకి రావడం, సెంచరీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని సానియా ట్వీట్ చేసింది.
Allhamdulillah 😊 @realshoaibmalik so happy for you .. Belief does wonders .. pic.twitter.com/blP4NNr6vQ
— Sania Mirza (@MirzaSania) May 26, 2015
ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 375 పరుగులు చేసింది. మహమ్మద్ హఫీజ్ 86, కెప్టెన్ అజర్ అలీ 79, హారిస్ సొహైల్ 89 (నాటౌట్) పరుగులతో రాణించగా, మాలిక్ 76 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. మాలిక్ ఇన్నింగ్స్ చివరి బంతిలో అవుటయ్యాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తన శక్తికి మించి పోరాడింది. 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 334 పరుగులు చేసింది. అసాధ్యంగా కనిపిస్తున్న లక్ష్యాన్ని చూసి బెదిరిపోకుండా జింబాబ్వే బ్యాట్స్మన్ హామిల్టన్ మసకంజా 73 పరుగులు చేయగా, కెప్టెన్ ఎల్టన్ చిగుంబురా (117) సెంచరీ సాధించాడు.
సిన్ విలియమ్స్, సికందర్ రజా చెరి 36 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. జింబాబ్వే ఓడినప్పటికీ, ఆ జట్టు గెలుపు కోసం చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది.