న్యూయార్క్: భారత దేశంలో లింగ వివక్ష కారణంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ దేశంలో ఓ సానియా మీర్జా తయారు కావడం కష్టమైన పనేనని ఆమె అభిప్రాయపడ్డారు. తన జీవితంలో తన చుట్టు ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఓ మహిళను అయినందున తన క్రీడా జీవితంలో పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఒకవేళ తాను పురుషుడిని అయి ఉంటే చాలా వివాదాలు ఉండకపోయేవని అభిప్రాయపడ్డారు. మన కల్చర్ మారాలని, చాలామంది మహిళలు క్రీడల్లోకి ప్రవేశిస్తున్నారని చెప్పారు.
మన ప్రస్తుత కేంద్ర క్రీడాశాఖ మంత్రి సోనోవాల్ మహిళలను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. తాను వ్యక్తిగతంగా ఆయనను చూసి ఈ విషయం తెలుసుకున్నానని కొనియాడారు. మన విధానం మారాలని, దీనిపై మీడియా కూడా బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు.
మీడియా అనేది అతిపెద్ద వాయిస్ అని, అది ఎలాంటి మార్పునైనా తీసుకు రాగలదని అభిప్రాయపడ్డారు. మహిళలు లింగ వివక్ష ఎదుర్కొంటున్నారన్నారు. మహిళలను జంతువుల్లా చూస్తున్నారని, ఇది సరికాదన్నారు. మన ఆలోచనలో కూడా మార్పు రావాలన్నారు.
ఐక్యరాజ్య సమితి ప్రశంసలు
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఐక్యరాజ్యసమితి సుహృద్భావ ప్రచారకర్తగా నియమితురాలైన విషయం తెలిసిందే. ఆమె నియామకంపై ఐరాస మహిళా విభాగం స్పందించింది. సానియాపై ప్రశంసల జల్లు కురిపించింది. సానియా ఒక్క భారత అమ్మాయిలకే కాకుండా ప్రపంచంలోని బాలికలందరికీ కూడా ఆదర్శప్రాయురాలని పేర్కొంది.
ఐరాస అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, ఐరాస మహిళా విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ లక్ష్మీ పురి మాట్లాడుతూ... సానియా వంటి డైనమిక్ మహిళ తమ దక్షిణాసియా గుడ్విల్ అంబాసడర్గా వ్యవహరించడాన్ని గౌరవంగా, సంతోషకరంగా భావిస్తున్నామన్నారు. సానియా ఓ యూత్ ఐకాన్ అని, క్రీడారంగానికి దీపస్తంభం వంటిదని, మహిళల సమస్యలపై ఆమె ఎన్నోసార్లు ఎలుగెత్తిందన్నారు.