న్యూఢిల్లీ: తమ దేశం బాక్సర్ ఎల్ సరితా దేవిపై విధించిన ప్రొవిజనల్ సస్పెన్ ఎత్తేయాలని బాక్సింగ్ ఇండియా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి విజ్ఞప్తి చేసింది. సరితా దేవి బేషరతుగా క్షమాపణ చెప్పిందని, కఠిన క్రమశిక్షణకు గతంలో కట్టుబడిన చరిత్ర ఆమెకు ఉందని చెబుతూ వాటిని దృష్టిలో ఉంచుకుని సస్పెన్షన్ ఎత్తేయాలని కోరినట్లు బాక్సింగ్ ఇండియా అధ్యక్షుడు సందీప్ జజోడియా చెప్పారు.
ఇంచియాన్లో జరిగిన ఆసియా క్రీడల్లో వివాదాస్పదమైన సెమీ ఫైనల్ ఓటమికి తీవ్ర మనస్తాపానికి గురైన సరితా దేవి కాంస్య పతకాన్ని స్వీకరించడానికి నిరాకరించింది. ఈ సస్పెన్షన్తో కొరియాలోని జెజూ ఐలాండ్లో నవంబర్ 19 నుంచి జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆమె పాల్గొనడంపై అనుమానాలు తలెత్తాయి.
క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్ సంఘం ఆమె ప్రవర్తనపై వ్యక్తం చేసిన అభిప్రాయాల నేపథ్యంలో భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి బాక్సింగ్ ఇండియా సోమవారం సమావేశమైంది. సరితా దేవిది పూర్తిగా ఉద్వేగభరితమైన ప్రతిస్పందన అని, ఓటమితో అసంతృప్తికి గురైనవారు ఆ విధంగా వ్యవహరించడం మానవసహజమని జజోడియా అన్నారు.
క్రీడాకారుల ప్రవర్తనా నియమావళిని సరితా దేవి కించపరిచే విధంగా వ్యవహరించిందనే విషయంలో వివాదం లేదని, అయితే సరితా దేవి బేషరతు క్షమాపణ చెప్పిందని, గతంలో ఇటువంటి తప్పు చేసిన చరిత్ర లేదని, పైగా సీనియర్ బాక్సర్ అని ఆయన అన్నారు.
అదో సంఘటన అని, దాన్ని మానవ దృక్కోణం నుంచి చూడాల్సి ఉంటుందని, వాళ్లు వివరణ కోరారని, నేడు తాము పంపించామని ఆయన అన్నారు. సరితాదేవితో పాటు జాతీయ పురుషుల చీఫ్ కోచ్ గుర్భక్ష్ సింగ్తో పాటు ముగ్గురు రింగ్ కోచ్లు సస్పెన్షన్కు గురయ్యారు. సరితా దేవి తన ప్రవర్తనకు బేషరతు క్షమాపణ చెబుతూ, ఇటువంటి చర్య పునరావృతం కాదని హామీ ఇస్తూ బాక్సింగ్ ఇండియాకు లేఖ రాసినట్లు సమాచారం.