పెర్త్: టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి తనను తిరిగి ఫాంలోకి తీసుకొచ్చారని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ చెప్పాడు. ఇందుకు రవిశాస్త్రికి శిఖర్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రపంచ కప్ టోర్నీకి ముందు శిఖర్ ధావన్ తీవ్రంగా విఫలమైన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఉన్నట్టుండి ప్రపంచకప్ పోటీలు మొదలవగానే రెచ్చిపోయాడు. రెండు ఇన్నింగ్స్ల్లో 105 పరుగుల సగటుతో వీర బాదుడు బాదేశాడు. ఇక శనివారం యూఏఈతో మ్యాచ్ ఉండటంతో ఈ సగటు మరింత పెరుగుతుందనే భావిస్తున్నారు. కాగా, ఒక్కసారిగా తనలో ఈ మార్పు రావడానికి రవిశాస్త్రి కారణమని చెప్పాడు శిఖర్ ధావన్.
ఆస్ట్రేలియా సిరీస్లో వరుస వైఫల్యాల తర్వాత.. తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన వ్యక్తి రవిశాస్త్రేనని చెప్పాడు. తన వైఫల్యాలపై ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయి.. కష్టపడటం మొదలుపెట్టానన్నాడు. అది తనకు నేర్చుకోడానికి బాగా ఉపయోగపడిందని, చిన్న చిన్న మార్పులు చేసుకుని మంచి ఫలితాలు సాధించానని అన్నాడు.
ఆ సమయంలో రవిభాయ్ తమకు తోడుగా ఉండటం ఎంతో ఉపయోగపడిందని, ఆయన తనలో బోలెడంత విశ్వాసాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంచారని ధావన్ చెప్పాడు. అదికూడా సరిగ్గా తనకు అవసరమైన సమయంలోనే ఆయన రావడం చాలా ఎనర్జీ ఇచ్చిందన్నాడు. జట్టు మొత్తం కూడా తనకు చాలా అండగా ఉందని, ఇందుకు వారందరికీ ఎంతో రుణపడి ఉంటానని శిఖర్ ధావన్ తెలిపాడు.