పెర్త్: ఈ వరల్డ్ కప్లో బౌలింగ్లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అంతకముందు ఆసీస్ పర్యటనలో ఏమంత ఆకట్టుకోని ఈ బెంగాల్ ఫాస్ట్ బౌలర్, ఐసీసీ వరల్డ్ కప్లో మాత్రం ప్రత్యర్ధి బ్యాట్స్మెన్లను సమర్ధవంతంగా కట్టడి చేస్తున్నాడు.
వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా ఎంపికైన షమీ రనప్ మార్పుతో బౌలింగ్లో వేగం కూడా పెరిగిందని చెప్పాడు. ఈ విషయంలో పాకిస్ధాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ సూచనలు తనకు ఎంతగానో ఉపయోగ పడ్డాయని వెల్లడించాడు.
'కొన్నాళ్ల క్రితం నా బౌలింగ్ గురించి పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్తో చర్చించాను. నా బౌలింగ్ శైలిని పరిశీలించిన అతను, రనప్ సమయంలో నా అంగళ్ల మధ్య దూరాన్ని తగ్గించమని సూచించాడు. దానిని పాటించాను. ఈ కొత్త రనప్ మంచి ఫలితాలు ఇచ్చింది' అని అన్నాడు.
దీని వల్ల ఇప్పుడు మరింత వేగంగా బౌలింగ్ చేయగలుగుతున్నానని షమీ వెల్లడించాడు. అయితే తన బౌలింగ్ యాక్షన్ను మార్చుకోవాలనే ఆలోచన లేదని చెప్పాడు. మాజీ క్రికెటర్లు సైతం బౌలింగ్ యాక్షన్ మార్చవద్దనే సలహా ఇచ్చారని అన్నాడు. పెర్త్ వికెట్ తనకు బాగా నచ్చిందని, తన శైలికి తగ్గట్లుగా మంచి బౌన్స్ ఉండటంతో వెస్టిండిస్పై వికెట్లు తీయగలిగానని చెప్పాడు.