న్యూఢిల్లీ: ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడిన బాధ నుండి అభిమానులు తేరుకోకముందే ఐపీఎల్ -8లో ఓ గట్టి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఓ షాకింగ్ కాంట్రోవర్సీ వెలుగు చూసింది. షారుక్ ఖాన్ యజమానిగా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 8 నుండి బయటకు రావొచ్చని అంటున్నారు. అదే సమయంలో షారుక్ బీసీసీఐని కోర్టుకు లాగనున్నారని అంటున్నారు.
ఐపీఎల్ 7 ఏప్రిల్ 7వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అభిమానులకు భారీ షాక్ తగిలింది! ఇప్పటికే ఐపీఎల్ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ రూపంలో మరొకటి వెలుగు చూసింది. ఈ వివాదం నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ఐపీఎల్ 8 నుండి వెళ్లిపోవచ్చు కూడా అంటున్నారు.
సమాచారం మేరకు... తమ జట్టుకు చెందిన స్పిన్నర్ సునీల్ నరైన్ అంశంపై తేల్చకుంటే తాము ఐపీఎల్ 8 నుండి తొలగుతామని కేకేఆర్ యాజమాన్యం బీసీసీఐని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, కోర్టుకు కూడా లాగుతామని బెదిరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
వెస్టిండీస్కు చెందిన సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ పైన అనుమానంతో 2014 ఛాంపియన్ లీగ్కు బ్యాన్ చేశారు. పలు మ్యాచులకు అతనిని బ్యాన్ చేశారు. అయితే, ఇతనికి ఇటీవలే ఐసీసీ క్లియరెన్స్ ఇచ్చింది.
ఐసీసీ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ.. బీసీసీఐ మాత్రం అతనిని మరోసారి పరీక్షించాలంటోంది. ఐపీఎల్ 8 ప్రాక్టీస్కు ముందే అతనిని చెన్నైలోని శ్రీ రామచంద్ర విశ్వవిద్యాలయంలో పరీక్షించాలని చెబుతోంది.
దీనిపై కోల్కతా నైట్ రైడర్స్ ఘాటుగా స్పందించిందని సమాచారం. ఐసీసీ ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చాక.. అతనికి మరో పరీక్ష ఏమిటని ప్రశ్నిస్తోంది. కాగా, ఐపీఎల్ 8లో కేకేఆర్ తన మొదటి మ్యాచ్ను ముంబై ఇండియన్స్తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 8న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో జరగనుంది. ఈలోగానే వివాదం రాజుకోవడం గమనార్హం.