న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా జాతీయ ఫుట్ బాల్ జట్టు కెప్టెన్, గోల్ కీపర్ సెంజో మెయివా దుండగుల కాల్పుల్లో మరణించాడు. జోహాన్నెస్ బర్గ్కు 20 కిలోమీటర్ల సమీపంలోని వోస్లూరస్ టౌన్ షిప్లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే... లెఫ్టినెంట్ జనరల్ సోలోమాన్ మాక్గేల్ తెలిపిన వివరాల ప్రకారం సెంజో మెయివా తన నివాసంలో ఉండగా, ఇద్దరు వ్యక్తులు లోనికి చొరబడి కాల్పులు జరిపారు. మరో వ్యక్తి బయట ఉన్నాడు. అనంతరం వారు పరారయ్యారు.
కాగా, దాడి సమయంలో మెయివా నివాసంలో ఏడుగురు వ్యక్తులు ఉన్నారని, కాల్పులకు ముందు వాగ్వివాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత సెంజో మెయివా మరణాన్ని ధృవీకరించారు.
దుండగుల ఆచూకీ తెలిపిన వారికి రూ.8.50 లక్షల భారీ నజరానా ప్రకటించారు. సెంజో మెయివా మృతిపై స్థానిక ఓర్లాండో పైరేట్స్ సాకర్ క్లబ్ చైర్మన్ ఇర్విన్ ఖోజా సంతాపం తెలిపారు. అతను నెంబర్ వన్ గోల్ కీపర్ అని పేర్కొన్నారు.
శనివారం ఓర్లాండో పైరేట్స్ సాకర్ క్లబ్లో ఆడిన సెంజో మెయివా దక్షిణాఫ్రికా సాకర్ టీమ్లో ప్రధాన ఆటగాడు. 2015 ఆఫ్రికా కప్ క్వాలిఫయిర్స్లో భాగంగా దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో మ్యాచ్లను ఆడుతున్నాడు.