న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో క్రీడాకారులు వరుసహా మరణిస్తుండటంతో ఆ దేశంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. శనివారం నాడు ఓ మహిళా బాక్సర్ ప్రాణాలు విడిచింది. అక్టోబర్ 10న జరిగిన ఓ బౌట్లో ఫిన్డిలె ఎంవెలాసే అనే బాక్సర్ ప్రత్యర్థి విసిరిన బలమైన పంచ్లకు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళింది.
రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడిన అనంతరం ప్రిటోరియా ఆసుపత్రిలో శనివారం తుదిశ్వాస విడిచిందని దక్షిణాఫ్రికా క్రీడల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అద్భుతమైన బాక్సర్ను కోల్పోయామంటూ దక్షిణాఫ్రికా బాక్సింగ్ సంఘం విచారం వ్యక్తం చేసింది.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా బాక్సర్ ఫిన్డిలె ఎంవెలాసే మృతి పట్ల తన హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశాడు. గత శుక్రవారం 800మీ మాజీ ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ రజత పతక విజేత బులేని ములౌడ్జి కారు ప్రమాదంలో మరణించారు.
ఇక దక్షిణాఫ్రికా సాకర్ జట్టు కెప్టెన్ సెంజో మెయినా ఆదివారం రాత్రి ఆంగతకులు జరిపిన కాల్పుల్లో మరణించాడు. దీంతో ఐదు రోజుల్లో ముగ్గురు దక్షిణాఫ్రికా క్రీడాకారులు ప్రాణాలు విడిచారు. దక్షిణాఫ్రికా క్రీడారంగానికి ఇది కష్టకాలమని క్రీడల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
RT @YangaBokveld: This is Phindile Mwelase #RIPPhindileMwelase pic.twitter.com/Mujru4Suag
— Honourable Sangxa (@sangxa) October 28, 2014