బెంగుళూరు: టీమిండియా స్ఫిన్నర్ అమిత్ మిశ్రా ఇబ్బందుల్లో పడ్డాడు. ఓ మహిళపై చేయి చేసుకున్నాడనే ఆరోపణలతో బెంగుళూరు పోలీసులు అమిత్ మిశ్రాపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గత సెప్టెంబర్లో టీమిండియా ట్రైనింగ్ సెషన్లో పాల్గొనేందుకు అమిత్ మిశ్రా బెంగుళూరుకు వచ్చాడు. ఈ సందర్భంగా తాను బస చేసిన ఫైవ్ స్టార్ హోటల్లో ఓ మహిళపై చేయి చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
బాధితురాలి ఫిర్యాదు మేరకు బెంగుళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజుల్లో వ్యక్తిగంతా హాజరు కావాలంటూ సమన్లు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.
బెంగుళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ సందీప్ పాటిల్ లోకల్ టీవి ఛానల్తో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్లో మహిళపై చేయి చేసుకున్నాడనే ఆరోపణలతో అమిత్ మిశ్రాపై కేసు నమోదైందని, ఆ కాపీని బీసీసీఐకు పంపించడం జరిగిందన్నారు.
దక్షిణాఫ్రికాతో జరగుతున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరిస్లో టీమిండియా తరుపున అమిత్ మిశ్రా ఆడుతున్నాడు. 2-1తో దక్షిణాఫ్రికా ముందంజలో ఉంది. అక్టోబర్ 22 (ఆదివారం)నాడు నాల్గవ వన్డే చెన్నైలో జరగనుంది.
చివరి వన్డే అక్టోబర్ 25 (ఆదివారం) ముంబైలో జరగనుంది. 32 ఏళ్ల అమిత్ మిశ్రా దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగు మ్యాచ్ల టెస్టు సిరిస్లో తొలి రెండు టెస్టు మ్యాచ్లకు కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.